
సిడ్నీ: భారత్తో జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో బరిలోకి దిగిన న్యూజిలాండ్ తుది జట్టుపై ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తుది జట్టులో ఒక్క స్పిన్నర్ను ఆడించకపోవడం నిరాశకు గురిచేసిందన్నాడు. ఇది ఆ జట్టు కొంపముంచుతుందని కూడా చెప్పుకొచ్చాడు. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్లో టాస్ గెలిచిన కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తాము పేస్ ఆల్రౌండర్తో పాటు ఐదుగురు పేసర్లతో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు.
వాతావరణం కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో స్పిన్నర్ ఆజాజ్ పటేల్ను తీసుకోలేదని, పేస్ ఆల్రౌండర్ కోలిన్ గ్రాండ్ హోమ్ను తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. పైగా భారత జట్టు స్పిన్ను సమర్థవంతంగా ఆడుతుందని, అందుకే తీసుకోలేదని కూడా వెల్లడించాడు. ఇక భారత జట్టు మాత్రం ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగింది. మ్యాచ్ జరుగుతున్న కొద్దీ పిచ్ స్పిన్నర్లకు అవకాశం ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఫోర్త్ ఇన్నింగ్స్లో వారిని ఎదుర్కోవడం కష్టమంటున్నారు.
ఈ క్రమంలోనే ట్విటర్ వేదికగా న్యూజిలాండ్ తుది జట్టుపై స్పందించిన షేన్ వార్న్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ప్రతిష్టాత్మక ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ ఒక్క స్పిన్నర్కు అవకాశం ఇవ్వకపోవడం నిరాశకు గురిచేసింది. ఇప్పటికే ఈ పిచ్పై వచ్చిన ఫుట్మార్క్లతో స్పిన్కు అనుకూలించనుంది. గుర్తుంచుకోండి... వికెటే గనుక స్పిన్కు అనుకూలించి, భారత జట్టు 270/ 300 ప్లస్ స్కోర్ చేస్తే.. వాతావరణంలో ఎలాంటి మార్పులు లేకుంటే మ్యాచ్ ముగిసినట్లే.'అని వార్న్ అభిప్రాయపడ్డాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 53 ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ(31 బ్యాటింగ్), వైస్ కెప్టెన్ అజింక్యా రహానే(12 బ్యాటింగ్) ఉన్నారు. నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపిస్తున్నారు. ఓపెనర్లు రోహిత్ శర్మ(34), శుభ్మన్ గిల్(28) 62 పరుగుల భాగస్వామ్యంతో మంచి ఆరంభాన్ని అందించినప్పటికీ.. సెషన్ మొత్తం నిలవలేకపోయారు. కైల్ జెమీసన్ బౌలింగ్లో రోహిత్, నీల్ వాగ్నర్ ఓవర్లో గిల్ ఔటయ్యారు. దాంతో భారత్ 69/2తో లంచ్ విరామానికి వెళ్లింది. సెకండ్ సెషన్లో పూర్తిగా డిఫెన్స్కు పరిమితమైన పుజారా.. ట్రెంట్ బౌల్ట్ సూపర్ ఇన్ స్వింగర్కు వికెట్ల ముందు దొరికిపోయాడు. 54 బంతులు ఆడిన పుజారా(8).. బౌల్ట్ వేసిన ఆ బంతిని మాత్రం అంచానా వేయలేకపోయాడు.