
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ఆకాస్మిక మరణం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆవేదనకు గురిచేసింది. మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, గ్యారీ లినేకర్, క్రిష్ శ్రీకాంత్, మహమ్మద్ హఫీజ్, షోయబ్ అక్తర్, సీనియర్ ఆటగాళ్లు దినేశ్ కార్తీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ వకార్ యూనిస్, గౌతమ్ గంభీర్, సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా షేన్ వార్న్కు నివాళుల అర్పించారు.
'దిగ్గజ స్పిన్నర్లలో ఒకడు. స్పిన్ను ప్రపంచవ్యాప్తంగా చేసిన బౌలర్ షేన్ వార్న్ లేడనే వార్తను నమ్మలేకపోతున్నా. జీవితం అంటే చాలా సులువుగా ఉంటుంది. కానీ దానిని అర్థం చేసుకోవడమే కష్టం. వార్న్ కుటుంబసభ్యులకు నా సానుభూతి' అని వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. 'ఈ వార్త షాక్కు గురి చేసింది. మేమంతా నిన్ను మిస్ అయ్యాం. నీ చుట్టు పక్కల ఎప్పుడూ నిరుత్సాం దరి చేరనీయవు. అది మైదానంలోనైనా.. బయటైనా సరే'అని సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు.
'క్రికెట్ దిగ్గజం షేన్వార్న్ మృతి చెందారనే విధ్వంసకర వార్త విన్నా. నోట మాట రావడం లేదు. షాకింగ్గా ఉంది. గొప్ప ఆటగాడు, మంచి మనిషి' అని పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ట్వీట్ చేశారు.
'షేన్వార్న్ ఇక లేరనే వార్త నమ్మలేకపోతున్నా.. ఇది అబద్ధమని చెప్పండి' అని దినేష్ కార్తీక్ విస్మయం వ్యక్తం చేశాడు. 'ఒకే రోజు ఇద్దరు దిగ్గజాలు కన్నుమూయడం విషాదకరం. మార్ష్, వార్న్ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి' అని డేవిడ్ వార్నర్ ట్వీట్ చేశాడు.