ఆసియా కప్ 2025 టోర్నీలో పాకిస్థాన్తో ఫైనల్ ముంగిట టీమిండియా అద్భుత విజయాన్నందుకుంది. శుక్రవారం శ్రీలంకతో ఉత్కంఠగా సాగిన ఆఖరి సూపర్ 4 మ్యాచ్లో టీమిండియా సూపర్ ఓవర్లో గెలచింది. చప్పగా సాగిన ఆసియా కప్ 2025 టోర్నీలో ఈ మ్యాచ్ ప్రత్యేకంగా నిలిచింది. అయితే ఈ మ్యాచ్ సూపర్ ఓవర్లో అంపైర్ తప్పిదం కారణంగా హైడ్రామా చోటు చేసుకుంది. అంపైర్ కారణంగా శ్రీలంక బ్యాటర్ డసన్ షనక రనౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కానీ అతను మరుసటి బంతికే క్యాచ్ ఔటవ్వడంతో అంతా ఊపీరి పీల్చుకున్నారు. లేదంటే ఈ వ్యవహారం తీవ్ర వివాదాస్పదమయ్యేది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 202 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(31 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 61), తిలక్ వర్మ(34 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 49 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగగా.. సంజూ శాంసన్(23 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 39), అక్షర్ పటేల్ (15 బంతుల్లో ఫోర్, సిక్స్తో 21 నాటౌట్) మెరుపులు మెరిపించారు. శ్రీలంక బౌలర్లలో మహీష తీక్షణ, దుష్మంత్ చమీర, వానిందు హసరంగ, డసన్ షనక, చరిత్ అసలంక చెరో వికెట్ తీసారు.

అనంతరం శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 202 పరుగులే చేసింది. పాతుమ్ నిస్సంక(58 బంతుల్లో7 ఫోర్లు, 6 సిక్స్లతో 107 నాటౌట్) సెంచరీతో చెలరేగగా.. కుశాల్ పెరీరా(32 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 58) హాఫ్ సెంచరీతో రాణించాడు. డసన్ షనక(11 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 22 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీ, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా తలో వికెట్ తీసారు. దాంతో స్కోర్లు టై అయ్యి సూపర్ ఓవర్కు దారి తీసింది.
సూపర్ ఓవర్లో అర్ష్దీప్ సింగ్ బౌలింగ్ చేయగా.. తొలి బంతికే కుశాల్ పెరీరా(0) ఔటయ్యాడు. తర్వాతి రెండు బంతులకు వైడ్ సాయంతో రెండు పరుగులే రాగా.. నాలుగో బంతిని డసన్ షనక షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి మిస్సై వికెట్ కీపర్ సంజూ శాంసన్ చేతిలో పడింది. షనక క్రీజు ధాటి సింగిల్ తీసే ప్రయత్నం చేయగా.. సంజూ రనౌట్ చేశాడు. లెగ్ అంపైర్ కూడా ఔట్ అని తేల్చాడు. అయితే అంతకుముందే క్యాచ్ ఔట్ కోసం అర్ష్దీప్ సింగ్ అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చాడు.
ఇక్కడే తెలివిగా వ్యవహరించిన డసన్ షనక క్యాచ్ ఔట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రివ్యూ తీసుకున్నాడు. థర్డ్ అంపైర్ సమీక్షలో బంతి బ్యాట్కు తాకలేదని తేలింది. దాంతో నాటౌట్ ఇచ్చారు. ఈ నిర్ణయంతో భారత ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు అవాక్కయ్యారు. క్లియర్గా రనౌట్ అయిన తర్వాత క్యాచ్ ఔట్ సమీక్ష ఏంటని ఆశ్చర్యంగా చూశారు.
కానీ అక్కడే డసన షనక తెలివి అందరికి అర్థమైంది. అర్ష్దీప్ సింగ్ క్యాచ్ ఔట్ కోసం అప్పీల్ చేయగానే అంపైర్ ఔటివ్వడంతో రూల్స్ ప్రకారం ఆ బంతి డెడ్ అయినట్లు. ఆ తర్వాత సింగిల్ తీసినా.. రనౌట్ చేసినా లెక్కలోకి రాదు. దాంతోనే షనక రివ్యూ తీసుకొని బచాయించగా.. భారత ఆటగాళ్లు నిరాశకు గురయ్యారు. కానీ ఆ మరుసటి బంతికే అతను క్యాచ్ ఔటవ్వడంతో సూపర్ ఓవర్లో శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ తొలి బంతికే 3 పరుగులు చేసి గెలుపొందింది. అయితే అంపైర్ నిర్ణయాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు. ఫైనల్లో ఇలానే జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.