
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టీ20I సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు షాకింగ్ న్యూస్. భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీకి శనివారం కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో షమీకి కరోనా పాజిటివ్ రావడంతో ఈ సిరీస్కు షమీ దూరమయ్యే అవకాశముంది. ఇకపోతే షమీ చాలా కాలం పాటు టీమిండియా టీ20 సెటప్కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది టీ20 ప్రపంచకప్ సందర్భంగా షమీ చివరిసారిగా టీమిండియా తరఫున ఆడాడు.
ఆ తర్వాత అతను భారత్ తరఫున టీ20ల్లో ఆడలేదు. షమీ ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ తరఫున అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. గుజరాత్ జట్టు అరంగేట్రం చేసిన తొలిసారే ట్రోఫీ గెలవడంలో షమీ కీలక పాత్ర పోషించాడు. అప్పటి నుంచి భారత టీ20 సెటప్లో షమీని చేర్చాలని చాలా మంది మాజీ ఆటగాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.
ఆసియాకప్ జట్టుకు షమీ సెలెక్ట్ కాలేదు. దీంతో టీమిండియా సెలెక్షన్ కమిటీపై విమర్శలు తీవ్రమయ్యాయి. ఇక ఆసియాకప్ టోర్నీలో భారత్ సూపర్ 4దశలోనే ఇంటి బాట పట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సిరీస్లతో పాటు టీ20 వరల్డ్ కప్ జట్టు సెలెక్షన్లో మాత్రం షమీని సెలెక్షన్ కమిటీ పరిగణనలోకి తీసుకుంది.
టీ20 ప్రపంచకప్ జట్టులో షమీని స్టాండ్బై ప్లేయర్గా ఎంపిక చేశారు. సెప్టెంబర్ 20న మొహాలీలో ప్రారంభం కానున్న ఆస్ట్రేలియాతో జరగబోయే టీ20 సిరీస్కు ప్రధాన పేసర్గా షమీ ఎంపికైనప్పటికీ.. అతనికి కోవిడ్-19పాజిటివ్ తేలడంతో ఇక ఈ సిరీస్కు అందుబాటులో ఉండడం దాదాపు అసాధ్యమయింది. ఇక షమీ స్థానంలో మరో పేసర్ ఉమేష్ యాదవ్ జట్టుకు ఎంపికైనట్లు పీటీఐ వెల్లడించింది.
ఆస్ట్రేలియాతో మూడో టీ20కి బరిలో దిగే భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, ఆర్. అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్(షమీ రిప్లేస్ మెంట్) , హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా