బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ తన భార్యను మోసం చేసినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని తేలింది. ఈ పుకార్లపై తాజాగా షకీబ్ అల్ హసన్ సతీమణి ఉమ్మీ అహ్మద్ శిశిర్ స్పందించింది. ఇవన్నీ అసత్య వార్తలని స్పష్టం చేసింది. దయచేసి ఎవరూ ఈ వార్తలను నమ్మవద్దని కోరింది. భర్తగా, తండ్రిగా షకీబ్ తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడని, తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేసింది.
షకీబ్తో ఉన్న ఫోటోలను ఆమె సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించడంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయనే ప్రచారం జరిగింది. అయితే తాను ఫోటోలను తొలగించలేదని, ప్రైవేట్లో మాత్రమే పెట్టానని వివరణ ఇచ్చింది.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్ను పంచుకుంది. 'క్రికెట్ పరంగా మా ఆయన గురించి మీకు రకరకాల అభిప్రాయలు ఉండొచ్చు. నేను వాటి జోలికి పోను. ప్రతీ ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంది. క్రికెట్ పరంగా షకీబ్ను ఎంతైనా విమర్శించండి. కానీ, దయచేసి వాటిని మా వ్యక్తిగత జీవితంతో ముడిపెట్టొద్దు.
మా ఆయన గొప్ప భర్త, తండ్రి. నాతో ఎంతో నిజాయితీగా ఉంటారు. నన్ను ఏ మాత్రం ఇబ్బంది పెట్టడు. మా ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉంది. పెళ్లయినప్పుడు నాతో ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. ఓ భర్తగా ఆయనకు నేను 100కు 100 మార్కులు ఇస్తాను. మాకు మంచి కుటుంబం ఉంది. దయచేసి మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే రూమర్స్ను ఆపండి.
వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటానికి నేను ఇష్టపడను. కానీ, అనవసరమైన కాల్స్, మెసేజ్లు వస్తుండటంతో అవన్నీ తప్పుడు వార్తలని స్పష్టం చేయడానికే ఈ ప్రకటన చేస్తున్నాను. షకీబ్ ప్రస్తుతం పాకిస్థాన్ పర్యటనలో ఉన్నాడు. నేను మా కుటుంబాన్ని చూసుకుంటున్నా. సోషల్ మీడియా నుంచి నేను ఎలాంటి ఫొటోలు తొలగించలేదు. ప్రైవేట్లో మాత్రమే ఉంచాను.'అని షకీబ్ భార్య తెలిపింది.
షకీబ్ అల్ హసన్ ప్రస్తుతం పాకిస్థాన్ పర్యటనలో ఉన్నాడు. ఆగస్ట్ 21 నుంచి పాక్, బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది.