వెస్టిండీస్ పర్యటనను పాకిస్థాన్ ఘోర పరాజయంతో ముగించింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా మంగళవారం జరిగిన ఆఖరి మ్యాచ్లో వెస్టిండీస్ 202 పరుగుల భారీ తేడాతో పాకిస్థాన్ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 294 పరుగులు చేసింది. షైహోప్(94 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్లతో 120) సెంచరీతో రాణించగా.. జస్టిన్ గ్రీవ్స్(24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 43) దూకుడుగా ఆడాడు. పాకిస్థాన్ బౌలర్లలో నసీమ్ షా(2/72), అబ్రర్ అహ్మద్(2/34) రెండేసి వికెట్లు తీయగా.. సయీమ్ ఆయుబ్, మహమ్మద్ నవాజ్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం పాకిస్థాన్ 29.2 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సల్మాన్ అఘా(30), మహమ్మద్ నవాజ్(23 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. పాకిస్థాన్ జట్టులో మొత్తం ఐదుగురు బ్యాటర్లు డకౌటయ్యారు. ఓపెనర్లు సయీమ్ ఆయుబ్(0), అబ్దుల్లా షఫీక్(0)లతో పాటు కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్(0), హసన్ అలీ(0), అబ్రర్ అహ్మద్(0) డకట్గా వెనుదిరిగారు.
బాబర్ ఆజామ్(9)కూడా నిరాశపర్చాడు. వెస్టిండీస్ బౌలర్లలో జైడెన్ సీల్స్(6/18) ఆరు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. గుడకేష్ మోతీ(2/37) రెండు వికెట్లు తీయగా.. రోస్టన్ ఛేజ్ ఓ వికెట్ పడగొట్టాడు. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ను వెస్టిండీస్ 2-1తో కైవసం చేసుకుంది.

ఈ ఘోర పరాజయంతో పాకిస్థాన్ తమ పేరిట చెత్త రికార్డ్ను నమోదు చేసుకుంది. 34 ఏళ్ల తర్వాత వెస్టిండీస్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయింది. చివరిసారిగా పాకిస్థాన్పై వెస్టిండీస్ 1991/92లో వన్డే సిరీస్ గెలిచింది. దాంతో పాకిస్థాన్ జట్టుపై ఆ దేశ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఆడితే పాకిస్థాన్ జట్టుకు ఒక్కరు కూడా సపోర్ట్ చేయరని, ఒక్క ప్రేక్షకుడు కూడా మ్యాచ్కు హాజరవ్వడని కామెంట్ చేస్తున్నారు. సీనియర్ ఆటగాళ్లంతా ఉండగా 92 పరుగులకు ఆలౌటవ్వడం ఏంటని, అది కూడా 10వ వన్డే ర్యాంక్ కలిగిన జట్టు చేతిలో ఓడిపోవడం దారుణమని మండిపడుతున్నారు. పాకిస్థాన్ జట్టు కంటే షైహోప్ 28 పరుగులు ఎక్కువ చేశాడని, పాక్పై షైహోప్ భారీ విజయమని నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు.