బ్రిడ్జ్టౌన్: పిచ్ కండిషన్స్కు తగ్గట్లు ఓపికగా బ్యాటింగ్ చేయకపోవడమే టీమిండియాతో తొలి వన్డేలో తమ ఘోర పరాజయానికి ప్రధాన కారణమని వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ అన్నాడు. ఈ దారుణ ఓటమిపై మాట్లాడటానికి మాటలు రావడం లేదన్నాడు. గురువారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్ను చిత్తు చేసింది.
ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా(3/37), కుల్దీప్ యాదవ్(4/6) ధాటికి ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 23 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. విండీస్ బ్యాటర్లలో షై హోప్ (45 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 43) మినహా అంతా విఫలమయ్యారు.

భారత స్పిన్నర్లకు తోడుగా హార్దిక్ పాండ్యా, ముకేష్ కుమార్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 22.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసి గెలుపొందింది. ఇషాన్ కిషన్(46 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 52) హాఫ్ సెంచరీతో రాణించాడు. స్వల్ప లక్ష్యం కావడంతో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేసింది.
ఈ ఘోర పరాజయంపై మ్యాచ్ అనంతరం స్పందించిన షై హోప్.. ప్రపంచకప్ క్వాలిఫయర్స్ ప్రదర్శననే మళ్లీ పునరావృతం చేస్తూ చిత్తుగా ఓడిపోవడం తీవ్ర అసహనానికి గురి చేసిందన్నాడు. 'ఈ ఓటమిపై ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. అసలు మాటలు రావడం లేదు. విజయం కోసం మేం ఆడలేదనేది వాస్తవం.
ఇలాంటి పిచ్లపై పరుగులు చేయాలంటే కాస్త ఓపికగా ఆడాలి. కానీ, మా బ్యాటింగ్లో అదే లోపించింది. ఉరుకులాట కొంపముంచింది. సీల్స్ అత్యుత్తమ పేసర్. తప్పకుండా భవిష్యత్తులో వెస్టిండీస్ క్రికెట్కు అతను ఆయుధంగా మారతాడు. ఇక భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని రెండో వన్డేలోనైనా కనీస పోటీనిచ్చే ప్రయత్నం చేస్తాం.'అని షైహోప్ చెప్పుకొచ్చాడు.
ఇరు జట్ల మధ్య రెండో వన్డే శనివారం జరగనుంది. వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్లోనూ పేలవ ప్రదర్శన కనబర్చిన వెస్టిండీస్ తొలి సారి వన్డే ప్రపంచకప్కు అర్హత సాధించలేకపోయింది.