పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ బాధ్యతల నుంచి మోహ్సీన్ నఖ్వీ తప్పుకోవాలని ఆ జట్టు మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది డిమాండ్ చేశాడు. ఆసియా కప్ 2025 టోర్నీలో పాకిస్థాన్ జట్టు వైఫల్యం నేపథ్యంలో అఫ్రిది ఈ ప్రతిపాదన చేశాడు. పాకిస్థాన్ మంత్రిగా.. పీసీబీ ఛైర్మన్గా నఖ్వీ న్యాయం చేయలేకపోతున్నాడని అభిప్రాయపడ్డాడు. పాకిస్థాన్ క్రికెట్పై ప్రత్యేక శ్రద్ద చూపే ఛైర్మన్ కావాలని అఫ్రిది నొక్కి చెప్పాడు.
ఆసియా కప్ 2025 టోర్నీలో పాకిస్థాన్ జట్టు భారత్ చేతిలో ఘోర పరాజయాలను ఎదుర్కొంది. భారత్తో ఆడిన మూడు మ్యాచ్లకు మూడింటిని పాకిస్థాన్ ఓడిపోయింది. ఫైనల్లో పోటీ ఇచ్చినా తొలి రెండు మ్యాచ్ల్లో చిత్తయ్యింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా కూడా నఖ్వీ వ్యవహరిస్తున్నాడు. కీలక పదవుల్లో ఉన్న నఖ్వీ పూర్తిగా సలహాదారుపై ఆధారపడుతున్నాడని అఫ్రిది ఆరోపించాడు.

'పీసీబీ ఛైర్మన్, పాకిస్థాన్ మంత్రి అయిన మోహ్సిన్ నఖ్వీ సాబ్కు నా అభ్యర్థన, సలహా ఏంటంటే.. పీసీబీ ఛైర్మన్ బాధ్యతల నుంచి వీలైనంత త్వరగా తప్పుకోవాలి. పీసీబీ అనేది పాకిస్థాన్ మంత్రిత్వ శాఖ కంటే పూర్తిగా భిన్నమైనది. కాబట్టి పీసీబీకి ఆయన దూరంగా ఉండాలి. పాకిస్థాన్ క్రికెట్కు ప్రత్యేక శ్రద్ద, సమయం కేటాయించే వ్యక్తి అవసరం. నఖ్వీ పూర్తిగా సలహాదారులపైనే ఆధారపడుతున్నారు. ఈ సలహాదారులు ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారు. క్రికెట్ గురించి తెలియదని ఆయనే స్వయంగా చెప్పారు. కాబట్టి ఆట గురించి తెలిసిన వ్యక్తులను పీసీబీ ఛైర్మన్గా, సలహాదారులుగా నియమించాలి.'అని అఫ్రిది విజ్ఞప్తి చేశాడు.
ఆసియా కప్ 2025 టోర్నీ సందర్భంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాకిస్థాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు. అయితే ఈ ఘటనపై పీసీబీ ఛైర్మన్గా నఖ్వీ అనవసర వివాదాన్ని సృష్టించాడు. మ్యాచ్ రిఫరీని తొలగించాలంటూ ఐసీసీకి ఫిర్యాదు చేశాడు. ఐసీసీ పట్టించుకోకపోవడంతో టోర్నీ నుంచి తప్పుకుంటామని బెదిరింపులకు దిగాడు.
ఇక ఆసియా కప్ ఫైనల్ అనంతరం నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకునేందుకు భారత్ నిరాకరించడంతో.. ఆ టైటిల్ను ఆటగాళ్లకు ఇవ్వకుండా తన వెంట తీసుకెళ్లిపోయాడు. ఈ వ్యవహరంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేయగా.. క్షమాపణలు చెప్పిన నఖ్వీ.. టైటిల్ కావాలంటే ఏసీసీ ఆఫీస్కు వచ్చి తీసుకెళ్లాలని కండిషన్ పెట్టాడు. దాంతో మరింత ఆగ్రహానికి గురైన బీసీసీఐ.. ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు సిద్దమైంది.