న్యూఢిల్లీ: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ప్రెసిడెంట్ నజామ్ సేథీపై ఆ దేశ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆసియా కప్ 2023 నిర్వహణ విషయంలో సేథీ పూటకో మాట మాట్లాడటాన్ని అఫ్రిది తప్పుబట్టాడు. వయసు పైబడటంతోనే సేథీ ఇలా మాట్లాడుతున్నాడని వ్యంగ్యస్త్రాలు సంధించాడు.
ఆసియాకప్ 2023 ఆతిథ్య హక్కులు పాకిస్థాన్కు ఉండగా.. అక్కడికి వెళ్లేందుకు టీమిండియా ససేమిరా అంటుంది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ.. వేదికను మార్చాలని పట్టుబడుతోంది. దాంతో బీసీసీఐపైకి బెదిరింపులకు పాల్పడిన పీసీబీ.. టీమిండియా పాక్కు రాకుంటే తాము భారత్ వేదికగా జరిగే ప్రపంచకప్ను బహిష్కరిస్తామని హెచ్చరించింది.

అయినా వెనక్కితగ్గకపోవడంతో టీమిండియా కోసం హైబ్రిడ్ మోడల్ను ప్రతిపాధించింది. భారత్ ఆడే మ్యాచ్లను యూఏఈ వేదికగా నిర్వహించి ఇతర మ్యాచ్లను పాక్లో జరుపుకుంటామని కోరింది. దీనికి ఇతర దేశాలు అంగీకరించకపోవడంతో ఇంగ్లండ్ వేదికగా ఆసియాకప్ నిర్వహిస్తామని తాజాగా సేథీ తెలిపాడు. ఈ వ్యాఖ్యలు ఆ దేశ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లకు ఆగ్రహం తెప్పించాయి.
ఈ కామెంట్స్పై సామా టీవీతో ఘాటుగా స్పందించిన షాహిద్ అఫ్రిది.. నజామ్ సేథీ తీరును తప్పుబట్టాడు. 'పీసీబీ చైర్మన్ అనే పదవి గొప్ప బాధ్యత అనే విషయాన్ని నజామ్ సేథీ గ్రహించాలి. ఇది తెలియకనే అతను పూటకో మాట మాట్లాడుతున్నాడు. ఆసియాకప్ను పాక్లో నిర్వహిస్తామంటాడు. మరోసారి యూఏఈ, ఇంగ్లండ్ అని చెబుతాడు. అసలు అతను ఇంటర్వ్యూలు ఇవ్వాల్సిన అవసరమే లేదు. వయసు పైబడటంతోనే నజమ్ సేథీ ఇలా మాట్లాడుతున్నాడు.
భారత్లో జరిగే ప్రపంచకప్ ఆడమని ఎందుకు అంటున్నారు. సానుకూలంగా ఆలోచించాలి. మన ఆటగాళ్లందరికి భారత్కు వెళ్లి ప్రపంచకప్ ఆడాలని చెప్పాలి. పాకిస్థాన్ మొత్తం మీతో ఉందని, భారత్లో ప్రపంచకప్ గెలిచి వారి చెంప చెళ్లుమనేలా ఆడాలని సూచించాలి.'అని అఫ్రిది చెప్పుకొచ్చాడు.
బీసీసీఐ మాత్రం ఆసియాకప్ 2023ను శ్రీలంకకు తరలించాలని పట్టుబడుతోంది. ఆ దేశానికి ఆర్థిక తోడ్పాటు అందించేందుకే ఈ నిర్ణయం తీసుకుందని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా జై షానే ఉండటంతో పాకిస్థాన్ ఆటలు సాగడం లేదు.