
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ 2022లో పాకిస్థాన్ పరాజయంపై స్పందించిన షోయబ్ అక్తర్కు టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ తనదైన శైలిలో చురకలంటించాడు. గుండె పగిలిన ఏమోజిని అక్తర్ షేర్ చేయగా.. దీన్నే కర్మ అంటారు బ్రదర్ అని షమీ బదులిచ్చాడు. భారత బౌలర్ల వైఫల్యంపై అక్తర్ విమర్శలు గుప్పించడంతోనే షమీ ఇలా బదులిచ్చాడు. అయితే మహమ్మద్ షమీ తీరును పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది తప్పుబట్టాడు. ఇలాంటివి చేయడం సరైంది కాదని ఓ టీవీ చర్చా కార్యక్రమంలో అఫ్రిది నీతి కబుర్లు చెప్పాడు.
'క్రికెటర్లుగా మనమంతా బ్రాండ్ అంబాసిడర్లం. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులను ఆపేందుకు నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి. అంతే కానీ ప్రజల్లో విద్వేషాలను వ్యాప్తి చేసేలా ఉండకూడదు. మనమే ఇలా చేస్తే.. చదువుకోని సామాన్యుడు ఇంకెలా ఆలోచిస్తాడు. వారి నుంచి ఇంకేమి ఆశిస్తాం? అందుకే మనం బంధాలు నిర్మించాలి. అందులోనూ క్రీడలు కీలక పాత్ర పోషించాలి. వారితో (భారత్) ఆడాలని కోరుకోవాలి. అలాగే ఆ జట్టు పాక్లో పర్యటించాలని కోరుకుందాం. మీరు ఆటకు వీడ్కోలు పలికిన ఆటగాడైతే అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. ఒకవేళ ఇప్పుడు జట్టు తరఫున ప్లేయర్ అయితే ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి'అని అఫ్రిది నంగనాచి మాటలు మాట్లాడాడు.
అయితే అఫ్రిది వ్యాఖ్యలపై భారత అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తమదాకా వస్తే గానీ పాక్ ఆటగాళ్లకు అసలు విషయం బోధపడేట్లు లేదు కదా? అని సెటైర్లు పేల్చుతున్నారు. సూపర్ -12 దశలో బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా అఫ్రిది భారత్పై అక్కసు వెళ్లగక్కాడు. ఐసీసీ, బీసీసీఐ కలిసి టీమిండియాను ఎలాగైనా సెమీస్కు చేర్చాలని భావించాయని వ్యాఖ్యలు చేశాడు. ఎందుకంటే అప్పటికి పాక్ సెమీస్ అవకాశాలు చాలా క్లిష్టంగా ఉన్నాయి.
ఇప్పుడు షమీ కర్మ బ్రదర్ అని ట్వీట్ చేసినందుకే సుద్దపూస మాటలు మాట్లాడుతున్నారు. ఇక షమీ ట్వీట్కు ప్రతిస్పందనగా షోయబ్ అక్తర్ కూడా ప్రముఖ వ్యాఖ్యాత హర్షాభోగ్లే వ్యాఖ్యలను జత చేస్తూ ట్వీట్ చేశాడు. ''చాలా తక్కువ జట్లు మాత్రమే 137 పరుగులను డిఫెండ్ చేసేందుకు ప్రయత్నిస్తాయి. అత్యుత్తమ బౌలింగ్ దళం కలిగిన పాక్కు క్రెడిట్ ఇవ్వాలి'' అని హర్షాభోగ్లే ట్వీట్ను షోయబ్ షేర్ చేసి ''దీనిని తెలివైన ట్వీట్ అంటారు'' అనే వ్యాఖ్యను జోడించాడు.