కరాచీ: క్రికెట్ టోర్నీలు నిర్వహించేందుకు పాకిస్థాన్ సేఫ్ కాదని బీసీసీఐ సెక్రటరీ జై షా చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఘాటుగా స్పందించాడు. కొంచెం బుర్ర ఉపయోగించి మాట్లాడాలని హితవు పలికాడు. గత 6 ఏళ్లుగా పాకిస్థాన్ అనేక టోర్నీలకు ఆతిథ్యం ఇచ్చిందని తెలిపాడు. ట్విటర్ వేదికగా స్పందించిన షాహిద్ అఫ్రిది పాకిస్థాన్ ఆతిథ్య ఇచ్చిన టోర్నీ వివరాలను తెలియజేస్తూ.. జై షాకు ట్యాగ్ చేశాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2023 నిర్వహించేందుకు పాకిస్థాన్ సిద్దంగా ఉందని, ఎలాంటి సందేహాలు అక్కర్లేదని స్పష్టం చేశాడు. 'పాకిస్థాన్లో ఆటగాళ్లకు సరైన భద్రత లభించదని ఆందోళన వ్యక్తం చేసిన జైషా గారు.. కొంచెంత తన బుర్రను రిఫ్రెష్ చేసుకోని ఈ విషయం తెలుసుకోవాలి. గత 6 ఏళ్లలో పాకిస్థాన్ చాలా టోర్నీలతో పాటు ఎంతో మంది విదేశీ ఆటగాళ్లకు ఆతిథ్యం ఇచ్చింది.

సెక్యూరిటీ పరంగా ఒక్కరికి కూడా ఇబ్బందులు కలగలేదు. 2017లో ఐసీసీ వరల్డ్ ఎలెవన్, శ్రీలంక మ్యాచ్కు ఆతిథ్యం ఇచ్చింది. 2018లో వెస్టిండీస్ జట్టు పర్యటించింది. 2019లో వెస్టిండీస్, బంగ్లాదేశ్ మహిళల జట్లతో పాటు శ్రీలంక జట్టుకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చింది. 2020లో పీఎస్ఎల్, ఎసీసీ, జింబాబ్వే టోర్నీలను నిర్వహించింది.
2021లో వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లు పర్యటించడంతో పాటు పీఎస్ఎల్ను విజయవంతంగా పూర్తి చేసింది. 2022లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఐర్లాండ్ మహిళలు, ఇంగ్లండ్ జట్టు పర్యటించాయి. పీఎస్ఎల్ కూడా జరిగింది. 2023లో న్యూజిలాండ్ పర్యటించగా.. పీఎస్ఎల్, మహిళల ఎగ్జిబిషన్ మ్యాచ్లు జరిగాయి.
ప్రస్తుతం జరుగుతున్న ఆసియాకప్లోనూ నాలుగు మ్యాచ్లను (పాకిస్థాన్- నేపాల్, శ్రీలంక- బంగ్లాదేశ్, బంగ్లాదేశ్-పాకిస్థాన్) విజయవంతంగా నిర్వహించింది. టోర్నీల నిర్వహణ విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు జైషా గారూ.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహించేందుకు పాకిస్థాన్ అన్ని విధాలుగా సిద్దంగా ఉంది.'అని షాహిద్ అఫ్రిది ట్వీట్ చేశాడు.
ఇక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని పాకిస్థాన్లో నిర్వహించడంపై సభ్యత్వ దేశాలతో పాటు బ్రాడ్ కాస్టర్స్, మీడియా రైట్ హోల్డర్స్, స్టేడియం రైట్ హోల్డర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఇటీవల జై షా ఓ ప్రకటనను విడుదల చేశాడు. భద్రతా సమస్యలతో పాటు ఆ దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అక్కడ టోర్నీ నిర్వహణ సరికాదని అభిప్రాయపడ్డాయని పేర్కొన్నాడు.