
కరాచీ: టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ పోరాటం సెమీస్లోనే ముగిసింది. గురువారం జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా అద్భుతం చేసింది. ఓటమి అంచుల నుంచి తేరుకొని.. పాకిస్థాన్ మైండ్ బ్లాంక్ చేస్తూ టీ20 ప్రపంచకప్లో ఫైనల్కు దూసుకెళ్లింది. గెలుపు ఖాయం అనుకున్న సమయంలో పట్టు విడిచి మాథ్యూ వేడ్ ఇచ్చిన కీలక క్యాచ్ను హసన్ అలీ చేజార్చడంతో పాక్ ఇంటిదారిపట్టింది. అచ్చం న్యూజిలాండ్-ఇంగ్లండ్ సెమీస్ను తలపిస్తూ సాగిన పోరులో కివీస్ మాదిరిగానే ఆసీస్ మాయ చేసింది. మాథ్యూ వేడ్(17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 41 నాటౌట్), మార్కస్ స్టోయినీస్(31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 నాటౌట్) వీరిచిత బ్యాటింగ్తో ఆసీస్ 5 వికెట్ల తేడాతో పాక్ను ఓడించింది.
అయితే మాథ్యూ వేడ్ ఇచ్చిన క్యాచ్ను హసన్ అలీ వదిలినా.. షాహిన్ షా అఫ్రిది మూడు సిక్స్లు ఇవ్వాల్సింది కాదని అతని కాబోయే మామ, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది అన్నాడు. షాహిన్ బౌలింగ్ తీరు తనకు ఆగ్రహం తెప్పించిందని, అతను వైడ్ యార్కర్లు వేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. 'షాహిన్ బౌలింగ్ తీరు నాకు ఆగ్రహం తెప్పించింది. హసన్ అలీ క్యాచ్ జార విడిచినా షాహిన్ మూడు సిక్స్లు ఇవ్వకుండా అడ్డుకోవాల్సింది. అతను బ్యాటర్ రీజియన్లో బౌలింగ్ చేయడానికి బదులు వైడ్ యార్కర్లు వేయాల్సింది. ఫీల్డర్ క్యాచ్ నేలపాలు చేస్తే.. తరువాతి బంతులు బౌండరీలు ఇవ్వాలని కాదు. షాహిన్ బౌలింగ్లో మంచి పేస్ ఉంది.
అతి త్వరలోనే ఈ తప్పిదం నుంచి గుణపాఠం నేర్చుకుంటాడని భావిస్తున్నా. బ్యాట్స్మన్ అలా సిక్సర్లు కొట్టే బౌలర్ అయితే అతను కాదు.'అని అఫ్రిది చెప్పుకొచ్చాడు. స్టంప్స్ టార్గెట్గా షాహిన్ వేసిన అద్భుతమైన యార్కర్లను మాథ్యూ వేడ్ స్మార్ట్గా స్వీప్ షాట్తో సిక్సర్లుగా మలిచాడు. దాంతో మరో ఓవర్ మిగిలుండగానే ఆసీస్ విజయాన్నందుకొని ఫైనల్కు దూసుకెళ్లింది. షాహిద్ అఫ్రిది పెద్ద కూతురితో షాహిన్ అఫ్రిది పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించిన విషయం తెలిసిందే. అఫ్రిది కూతురు చదువు పూర్తవ్వగానే వీరి వివాహం జరగనుంది.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. మహమ్మద్ రిజ్వాన్(52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 67), ఫకార్ జమాన్(29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 55 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. కెప్టెన్ బాబర్ ఆజామ్(34 బంతుల్లో 5 ఫోర్లతో 39) పర్వాలేదనిపించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 177 పరుగుల లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా 19 ఓవర్లలోనే 5 వికెట్లకు 177 పరుగులు చేసి 6 బంతులుండగానే విజయాన్నందుకుంది. మాథ్యూ వేడ్, మార్కస్ స్టోయినిస్లకు అండగా డేవిడ్ వార్నర్(30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 49), మిచెల్ మార్ష్(22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 28) రాణించారు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ నాలుగు వికెట్లు తీయగా.. షాహిన్ షా ఓ వికెట్ దక్కించుకున్నాడు.