గౌతం గంభీర్ తేడా గాడు.. అందరితో గొడవలే! బ్యాటింగ్ మాత్రం సూపరో సూపర్!
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ను ఉద్దేశించి పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశాడు. గంభీర్ ఓ తేడా గాడని, అతని వ్యక్తిత్వం భిన్నంగా ఉంటుందన్నాడు. అందరితో గొడవలు పెట్టుకుంటాడని తెలిపాడు. ఈ మాజీ ఆటగాళ్ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే వైరం ఉందన్న విషయం తెలిసిందే.
ఈ ఇద్దరూ ఆడే రోజుల్లో మైదానంలోనే ఎన్నోసార్లు గొడవపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు నోరు పారేసుకున్నారు. పాకిస్థాన్ అంటే గౌతం గంభీర్ ఊగిపోయేవాడు. దాయాదీతో మ్యాచ్ అంటే చాలా దూకుడుగా ఉండేవాడు. ఈ క్రమంలోనే పాక్ ఆటగాళ్లు ఏమన్నా.. అదే స్థాయిలో బదులిచ్చే వాడు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన లెజెండ్స్ లీగ్ కారణంగా షాహిద్ అఫ్రిది, గౌతం గంభీర్ మరోసారి తలపడ్డారు.

తాజాగా గంభీర్ గురించి మాట్లాడిన షాహిద్ అఫ్రిది అతను ఇప్పటికీ మారలేదని తెలిపాడు. ఐపీఎల్ 2023 సీజన్ సందర్భంగా విరాట్ కోహ్లీతో గంభీర్ గొడవపడటంపై స్పందించిన అఫ్రిది.. అతని వ్యక్తిత్వమే అలాంటిదని తెలిపాడు. 'క్రికెట్లో ఇలాంటి గొడవలు చాలా సహజం. సోషల్ మీడియా కారణంగా ప్రతీ చిన్న గొడవను చాలా పెద్దదిగా కనబడుతోంది.
గౌతం గంభీర్ చాలా తేడా మనిషి. అతని వ్యక్తిత్వం భిన్నంగా ఉంటుంది. టీమిండియాలో కూడా అతన్ని అలాగే చూసేవారు. కేవలం నాతో మాత్రమే అతను గొడవపడలేదు. చాలా మందితో వాగ్వాదానికి దిగాడు. అయితే ఇప్పుడు గంభీర్ గొడవల గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది.
అతని వ్యక్తిత్వం ఎలా ఉన్నా గౌతం గంభీర్ చాలా అద్భుతమైన ఆటగాడు. అతని బ్యాటింగ్ టైమింగ్ చూడ ముచ్చటగా ఉంటుంది. అతని బ్యాటింగ్ను నేను ఎంతగానో ఆస్వాదిస్తాను. టీమిండియాలో చాలా తక్కువ మందికి గంభీర్లాంటి బ్యాటింగ్ టైమింగ్ ఉంటుంది.'అని అఫ్రిది కొనియాడాడు.
టీమిండియా తరుపున 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20 మ్యాచులు ఆడిన గౌతం గంభీర్.. మూడు ఫార్మాట్లలో కలిపి 20 సెంచరీలతో 10 వేలకు పైగా పరుగులు చేశాడు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో కీలక ఇన్నింగ్స్లు ఆడి భారత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం రాజకీయాల్లోకి వెళ్లిన గంభీర్.. బీజేపీ ఎంపీగా ఎన్నికయ్యారు. ఐపీఎల్లో లక్నోసూపర్ జెయింట్స్ మెంటార్గా సేవలందిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications