
ఇస్లామాబాద్: కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తన స్వచ్చంద సంస్థ ద్వారా సాయం చేస్తున్న విషయం తెలిసిందే. బియ్యం, నిత్యవసర వస్తువులు అందజేస్తున్నాడు. ఈ విపత్కర పరిస్థితుల్లో అఫ్రిది సేవకు ముగ్దులైన భారత వెటరన్ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్.. ట్విటర్ వేదికగా అఫ్రిది ఫౌండేషన్కు విరాళాలు ఇవ్వాలని ఓ వీడియో సందేశం ద్వారా అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
అయితే ఇది నచ్చిన కొంతమంది అభిమానులు ఈ ఇద్దరి క్రికెటర్లపై తీవ్ర ట్రోలింగ్కు దిగారు. మతిపోయిందా.. శతృదేశానికి సాయం చేయమంటారు? అని ఘాటుగా కామెంట్ చేశారు. ఇక ఈ ట్రోలింగ్ను యూవీ, భజ్జీ కూడా తిప్పికొట్టారు. ఈ విపత్కర పరిస్థితుల్లో సరిహద్దుల కన్నా మానవత్వం గొప్పదని చురకలంటించారు. ఇక తనకు అండగా నిలిచిన యూవీ, భజ్జీలకు అఫ్రిది కూడా ధన్యవాదాలు తెలిపాడు.
అయితే యూవీ, భజ్జీలపై జరిగిన ట్రోలింగ్పై అఫ్రిది తాజాగా స్పందించినట్లు పాక్ జర్నలిస్ట్ సజ్ సాదిక్ ట్వీట్ చేశాడు. గతంలో యువరాజ్ సింగ్ ఫౌండేషన్కు తాను పదివేల డాలర్ల విరాళం ప్రకటించానని, అప్పుడు పాకిస్థాన్లోని ప్రతీ ఒక్కరూ తనను అభినందించారని అఫ్రిది చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో భారత్కు ఎందుకు సాయం చేస్తున్నావని ఏ ఒక్కరూ.. తనను ప్రశ్నించలేదని పరోక్ష భారత అభిమానుల తీరును తప్పుబట్టాడు.
'నేను కెనడాలో ఉన్నప్పుడు యువరాజ్ సింగ్ ఫౌండేషన్కు మద్దతుగా 10వేల డాలర్ల విరాళం అందించాను. అప్పుడు పాకిస్థాన్లో ప్రతీ ఒక్కరు అభినందించారు. ఏ ఒక్కరు కూడా భారత్కు ఎందుకు సాయం చేశావని ప్రశ్నించలేదు.'అని అఫ్రిది చెప్పినట్లు సజ్ సాదిక్ ట్వీట్ చేశాడు.