
న్యూఢిల్లీ: ఇంగ్లండ్తో మూడు టీ20ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. శనివారం ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన రెండో టీ20లో రోహిత్ సేత 49 పరుగుల తేడాతో గెలుపొందింది. దాందో టీమిండియా ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.
అయితే ఎప్పుడూ భారత్పై సోషల్ మీడియా వేదికగా అక్కసు వెళ్లబోసుకొనే పాకిస్థాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది కూడా టీమిండియా విజయాన్ని అభినందించాడు. ఆసీస్ వేదికగా మరో మూడు నెలల్లో జరగబోయే టీ20 ప్రపంచకప్ను సాధించే అవకాశం ఉన్న జట్లలో టీమిండియా ఒకటని అఫ్రిది కొనియాడాడు.
'ఇంగ్లండ్పై భారత్ అద్భుతంగా ఆడింది. సిరీస్ను దక్కించుకునేందుకు అన్ని అర్హతలు టీమిండియాకు ఉన్నాయి. మరీ ముఖ్యంగా బౌలింగ్ ప్రదర్శన అద్భుతం. అందుకే చెబుతున్నా.. ఆసీస్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ ఫేవరేట్స్లో భారత్ తప్పకుండా ఉంటుంది'అని షాహిద్ అప్రిది ట్వీట్ చేశాడు. భారత్ సిరీస్ విజయాన్ని ప్రస్తావిస్తూ ఐసీసీ షేర్ చేసిన ట్వీట్ను రీట్వీట్ చేస్తూ అఫ్రిది ఈ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్గా మారింది.
గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్లో భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్లో తలపడ్డాయి. అయితే తొలిసారి ఐసీసీ ఈవెంట్లలో టీమిండియాపై పాక్ విజయం సాధించి చరిత్ర తిరగరాసింది. ఈ టోర్నీలో భారత్ గ్రూప్ స్టేజ్లో ఇంటిముఖం పట్టగా.. పాకిస్థాన్ సెమీస్కు చేరుకుని ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. ఇక ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాలతో ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీలో మాత్రమే తలపడుతున్నాయి.
దాంతో ఈ ఇరు దేశాల పోరుకు మరింత క్రేజ్ ఏర్పడింది. ఇక ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్లో జరగనున్న టీ20 ప్రపంచకప్లోనూ ఇరు దేశాలు తమ తొలి మ్యాచ్లోనే తలపడనున్నాయి. అయితే ఈ మెగాటోర్నీకి ముందే ఆసియా కప్ 2022 టోర్నీలో భాగంగా పాకిస్థాన్తో భారత్ తలపడనుంది. ఆగస్టు 28న భారత్, పాకిస్థాన్ మధ్య ఆసియా కప్ గ్రూప్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది.