
న్యూఢిల్లీ: ఆసియా కప్ 2022లో భాగంగా భారత్ X పాకిస్థాన్ మధ్య జరగనున్న మ్యాచ్ సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇరు దేశాల అభిమానులే కాకుండా యావత్ క్రికెట్ ప్రపంచం ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తోంది. మరో నాలుగు రోజుల్లో(ఆదివారం) ఈ హైఓల్టేజ్ మ్యాచ్కు తెరలేవనుంది. దాయాది దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా చాలాకాలంగా రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. కేవలం ఐసీసీ, ఆసియా కప్ లాంటి టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. దాంతో దాయాదీ దేశాల పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ రెండు జట్లు చివరిసారిగా గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్లో పోటీపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత్పై పాక్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దాంతో ఆసియా కప్ వేదికగా జరిగే మ్యాచ్లో పాక్ను ఓడించి రెండింతల ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది. మరోవైపు, ఈ హైవోల్టెజీ మ్యాచ్లో ఏ జట్టు విజయం సాధిస్తుందన్న దానిపై అప్పుడే విశ్లేషణలూ మొదలయ్యాయి. మాజీ క్రికెటర్లు, అభిమానులు ఇప్పటికే తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ భారత్ గెలుస్తుందని జోస్యం చెప్పగా.. పాకిస్థాన్ మాజీ సారథి షాహిద్ అఫ్రిది మాత్రం ఊహించని సమాధానమిచ్చాడు.
'ఆసియా కప్లో భారత్, పాక్ మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్లలో ఏ జట్టు బలంగా ఉంది..? ఎవరు గెలుస్తారు?' అని ఓ నెటిజన్ అఫ్రిదిని ప్రశ్నించాడు. అయితే, అఫ్రిది పాక్ మాజీ ఆటగాడు కాబట్టి.. సొంత దేశమే గెలుస్తుందని చెప్తాడని అందరూ అనుకున్నారు. కానీ, అతడు ఎవరూ ఊహించని సమాధానమిచ్చాడు. ''ఎవరు తక్కువ తప్పులు చేస్తే వాళ్లే మ్యాచ్ గెలుస్తారు'' అని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. భారత్-పాక్ మ్యాచ్ అంటే తీవ్ర ఒత్తిడితో కూడుకున్నదని, ఒత్తిడిని జయించిన వారినే విజయం వరిస్తుందని అఫ్రిది చెప్పకనే చెప్పాడు.
ఇక, ఆసియా కప్లో చిరకాల ప్రత్యర్థులు ఇప్పటివరకూ 14 సార్లు తలపడగా.. 8 మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించింది. పాకిస్థాన్ ఐదింటిలో గెలుపొందింది. ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు.