టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫేవరేట్ భారత క్రికెటర్ అని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తెలిపాడు. వన్డేల్లో తన పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డ్ను రోహిత్ అధిగమించడం సంతోషంగా ఉందని చెప్పాడు. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీలకు వన్డే ప్రపంచకప్ 2027 ఆడే సత్తా ఉందని తెలిపాడు. వారిని జట్టుకు దూరం చేసే ప్రయత్నాన్ని అఫ్రిది తప్పుబట్టాడు. ఈ ఇద్దరూ భారత క్రికెట్కు వెన్నెముక అని తెలిపాడు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో రోహిత్ శర్మ, కోహ్లీలు అసాధారణ ప్రదర్శన కనబర్చారని తెలిపాడు.
తాజాగా పాకిస్థాన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీరును అఫ్రిది తప్పుబట్టాడు. 'ఇటీవల జరిగిన వన్డే సిరీస్లో రోహిత్, విరాట్ కోహ్లీలు అద్భుతంగా ఆడారు. ఈ ఇద్దరూ 2027 వన్డే ప్రపంచకప్ ఆడగలరు. ఇలాంటి స్టార్ ఆటగాళ్లను కాపాడుకోవాలంటే బలహీనమైన జట్లతో ఆడినప్పుడు విశ్రాంతి ఇవ్వాలి. ఆ సమయంలో కుర్రాళ్లను ఆడించాలి.

టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే అతను చేసే పని సరికాదనిపించింది. రోహిత్ శర్మ ఇటీవలే నా వన్డే రికార్డ్ను బద్దలు కొట్టాడు. రికార్డ్లు బద్దలయ్యేందుకే ఉంటాయి. ఇప్పుడు నా అత్యధిక సిక్స్ల రికార్డ్ కూడా కనుమరుగైంది. సంతోషకరమైన విషయం ఏంటంటే నాకు అత్యంత ఇష్టమైన ఆటగాడు ఆ రికార్డ్ను అధిగమించాడు. నేను అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డ్ కూడా సాధించాను.
ఆ రికార్డ్ కూడా 18 ఏళ్లు చెక్కు చెదరకుండా ఉంది. ఇటీవలే బద్దలైంది. రికార్డ్లు నమోదవుతాయి.. బద్దలవుతూనే ఉంటాయి. క్రికెట్ అంటేనే అది. ఐపీఎల్ 2008 సీజన్లో నేను రోహిత్ శర్మతో కలిసి డెక్కన్ ఛార్జర్స్కు ఆడాను. నాకు రోహిత్ శర్మ అంటే చాలా ఇష్టం. నెట్స్లో అతను బ్యాటింగ్ చేసిన తీరు చూసి.. కచ్చితంగా స్టార్ ఆటగాడు అవుతాడని ఆనాడే అనుకున్నాను.'అని అఫ్రిది చెప్పుకొచ్చాడు.