కరాచీ: భారత్ వేదికగా ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్లో తమ మ్యాచ్లను అహ్మదాబాద్లో కాకుండా ఇతర వేదికల్లో పెట్టాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కోరడాన్ని ఆ దేశ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తప్పుబట్టాడు. అహ్మదాబాద్ వేదికగా ఆడేందుకు పాకిస్థాన్ జట్టుకు ఉన్న సమస్య ఏంటని ప్రశ్నించాడు. నరేంద్రమోదీ స్టేడియంలో ఆడేందుకు పాకిస్థాన్ జట్టుకు అంత భయం ఎందుకు? అని నిలదీసాడు.
షెడ్యూల్ ప్రకారం ఆడి గెలిచి రావాలని సూచించాడు. ఓ పాక్ చానెల్తో మాట్లాడిన అఫ్రిది.. వేలాది భారతీయ అభిమానుల ముందు మ్యాచ్ గెలవడమే అసలమైన విజయమని చెప్పుకొచ్చాడు.'అహ్మదాబాద్లో ఆడేందుకు పాకిస్థాన్ జట్టు ఎందుకు నిరాకరిస్తుందో నాకు అర్థం కావడం లేదు. ఆ మైదానం ఏమైనా నిప్పులు కురిపించేదా..? లేక దయ్యాలు, భూతాలున్నాయా? ఒకవేళ ఇదే మీ సమస్య అయితే ఆ సవాళ్లను స్వీకరించండి.

షెడ్యూల్ ప్రకారం అక్కడికే వెళ్లి.. వేలాది భారతీయ అభిమానుల ముందు మ్యాచ్ గెలిచి చూపించండి. అప్పుడే కదా అసలు మజా లభిస్తోంది. పాకిస్థాన్ గెలవడమే మనకు ముఖ్యం. భారత్కు అక్కడ మ్యాచ్లు నిర్వహించడం సౌకర్యవంతమైతే అక్కడే ఆడాలి. వాళ్లు కోరుకున్న పిచ్ పై ఆడి మ్యాచ్ గెలవాలి. అలా సాధించిన గెలుపే అసలైన విజయం'అని షాహిద్ అఫ్రిది చెప్పుకొచ్చాడు.
అక్టోబర్లో జరిగే వన్డే ప్రపంచకప్ సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ ఇప్పటికే ఐసీసీకి పంపించింది. ఈ షెడ్యూల్పై పాకిస్థాన్ అభ్యంతరాలు తెలుపుతుండటంతో ఆలస్యమవుతోంది. పాకిస్థాన్ అభ్యంతరాలు తొలిగిపోతే షెడ్యూల్ అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే డ్రాఫ్ట్ షెడ్యూల్ బయటకు వచ్చింది.
మరోవైపు పాకిస్థాన్ రావడానికి భారత జట్టుకు ఉన్న సమస్యే తమకు ఉందని పీసీబీ ఛీఫ్ నజమ్ సేథీ అన్నాడు. తమ ప్రభుత్వం అనుమతిస్తేనే ప్రపంచకప్ ఆడేందుకు భారత్ రాగలమని, ఇదే విషయాన్ని ఐసీసీకి తెలియజేశామన్నాడు. తాము ముందుగా కోరిన వేదికల్లో అహ్మదాబాద్ లేదని, కానీ భారత్ మాత్రం తమతో అక్కడే మ్యాచ్ నిర్వహించాలని చూస్తోందన్నాడు.

పెద్ద మైదానం.. లక్ష సీటింగ్ కెపాసిటీ ఉండటంతోనే భారత్-పాక్ మ్యాచ్ను నరేంద్ర మోదీ స్డేడియం వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ మొగ్గు చూపుతోంది.