పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మరోసారి భారత్పై తన అక్కసును వెళ్లగక్కాడు. భారత సైన్యంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత బలగాల వైఫల్యం, చేతకాని తనంతోనే జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిందన్నాడు. భారత సైన్యం తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు పాకిస్థాన్పై నిందలు మోపుతుందని పేర్కొన్నాడు.
ఈ నెల 22న పహల్గాంలో అమాయక పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన భారత ప్రభుత్వం.. పాకిస్థాన్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. పాక్ను ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. అంతేకాకుండా అంతర్జాతీయ సమాజం ముందు పాక్ను దోషిగా నిలబెట్టాలని చూస్తోంది.

భారత చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన షాహిద్ అఫ్రిది.. రోజు టీవీ ఛానెల్స్తో మాట్లాడుతూ తన అక్కసును వెళ్లగక్కుతున్నాడు. భారత్లో పటాకులు కాల్చిన పాకిస్థాన్పై నింద వేస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. 'భారత్లో పటాకులు కాల్చిన పాకిస్థాన్నే నిందిస్తారు. కశ్మీర్లో 8 లక్షల బలమైన భారత సైన్యం ఉంది. అయినా ఉగ్రదాడి చోటు చేసుకుంది. ఈ ఘటనతో భారత బలగాల వైఫల్యం, అసమర్థత స్పష్టంగా అర్థమవుతోంది. ప్రజలకు భద్రత కల్పించడంలో భారత సైన్యం విఫలమవుతోంది.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఘటన జరిగిన గంట వ్యవధిలోనే భారత మీడియా, బాలీవుడ్ యాక్టర్ల అవతారమెత్తింది. ప్రతీ ఒక్కటి రాజకీయం చేయడం మీడియాకు సరికాదు. భారత మీడియా తీరును చూసి ఆశ్చర్యపోయాను. వారి మాటలు నాకు హాస్యాస్పదంగా అనిపించాయి. భారత టాప్ క్రికెటర్లు అయిన ఇద్దరు వ్యక్తులు.. నేరుగా పాకిస్థాన్ను నిందిస్తున్నారు. ఈ ఘటనకు క్రీడలకు ఏం సంబంధం. క్రీడలకు రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదు.'అని షాహిద్ అఫ్రిది చెప్పుకొచ్చాడు.