ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియా వరుసగా మూడో విజయాన్నందుకుంది. ఆదివారం ఏకపక్షంగా సాగిన గ్రూప్-ఏ పోరులో భారత్ 61 పరుగుల తేడాతో దాయదీ పాకిస్థాన్ను చిత్తు చేసింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇషాన్ కిషన్(40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 77) విధ్వంసకర హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. భారత బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా(2/17), హార్దిక్ పాండ్యా(2/16), అక్షర్ పటేల్(2/29), వరుణ్ చక్రవర్తీ(2/17) సమష్టిగా రాణించి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఇషాన్ కిషన్ సూపర్ బ్యాటింగ్తో భారత్ 176 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా.. బౌలర్ల ధాటికి పాకిస్థాన్ 114 పరుగులకే కుప్పకూలింది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా విజయానికి ఇషాన్ కిషన్, బౌలర్లు బుమ్రా, హార్దిక్, వరుణ్, అక్షర్ పటేల్ కారణం కాదని, పాకిస్థాన్ పేసర్ షాహీన్ షా అఫ్రిది వైఫల్యం భారత్కు విజయాన్నందించిందని క్రికెట్ల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ మ్యాచ్లో పాకిస్థాన్ ఆరుగురు స్పిన్నర్లను ఉపయోగించింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే ఓ జట్టు ఆరుగురు స్పిన్నర్లతో బౌలింగ్ చేయించడం ఇదే తొలిసారి. ఈ ఆరుగురు స్పిన్నర్లు 18 ఓవర్లు బౌలింగ్ చేయగా.. ఏకైక పేసర్గా బరిలోకి దిగిన షాహిన్ షా అఫ్రిది 2 ఓవర్లలో 31 పరుగులిచ్చుకున్నాడు. ఒక వికెట్ కూడా తీసాడు. అయితే అది అతని క్రెడిట్ కాదు. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అక్షర్ పటేల్ ధాటిగా ఆడే క్రమంలో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.
అఫ్రిది వేసిన తన తొలి ఓవర్ తొలి బంతికే ఇషాన్ కిషన్ సిక్సర్ బాదాడు. ఈ షాట్ మ్యాచ్ మూమెంటమ్నే మార్చింది. స్లోగా ఉన్న వికెట్పై అత్యంత వేగంగా షార్ట్ పిచ్ బాల్ వేయడం ఇషాన్ కిషన్కు కలిసొచ్చింది. ఆ తర్వాత ఇషాన్ కిషన్ మరో బౌండరీ బాదగా.. తిలక్ వర్మ ఆఖరి బంతికి ఒక బౌండరీ కొట్టాడు. దాంతో 15 పరుగులు వచ్చాయి. దాంతో తొలి ఓవర్ వేసి మంచి శుభారంభం అందించిన సల్మాన్ అఘా కష్టం బుగ్గిపాలైంది.
సల్మాన్ అఘా బౌలింగ్లో అభిషేక్ శర్మ డకౌటవ్వడంతో భారత్ 1/1తో నిలిచింది. ఈ పరిస్థితుల్లో షాహిన్ అఫ్రిది కాస్త కట్టడిగా బౌలింగ్ చేసుంటే భారత బ్యాటర్లపై ఒత్తిడి పెరిగేది. కానీ అతను పేలవ బౌలింగ్తో ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. స్లోగా ఉన్న వికెట్పై నెమ్మదిగా బంతులు వేయకుండా వేగంగా వేసి మూల్యం చెల్లించుకున్నాడు.

ఆ తర్వాత అఫ్రిదికి బంతినిచ్చేందుకు సల్మాన్ అఘా సాహసం చేయలేదు. ఆఖరి ఓవర్లో మరోసారి బంతి ఇవ్వగా.. శివమ్ దూబే ఫోర్, రింకూ సింగ్ 4, 6 బాదడంతో 16 పరుగులు వచ్చాయి. తర్వాత రెండు బంతులను వేగం తగ్గించి బౌలింగ్ చేసిన షాహిన్ అఫ్రిది ఓ రనౌట్తో పాటు వికెట్ తీసాడు. ముందు నుంచే ఇలా బౌలింగ్ చేసుంటే పాకిస్థాన్కు కలిసొచ్చేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్లోగా ఉన్న ఈ వికెట్పై భారత్ 160 పరుగుల్లోపే పరిమితమై ఉంటే మ్యాచ్ ఉత్కంఠగా మారేది. ఇదే విషయాన్ని మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా తెలిపాడు.
షాహిన్ షా అఫ్రిది వైఫల్యంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, షోయబ్ అక్తర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని వైఫల్యం జట్టు పతనాన్ని శాసించిందని చెప్పారు. తన అల్లుడైనా సరే షాహిన్ అఫ్రిదిని జట్టు నుంచి తప్పించాలని షాహిద్ అఫ్రిది డిమాండ్ చేశాడు.