న్యూజిలాండ్ గడ్డపై పాకిస్థాన్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఆతిథ్య జట్టుతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో పాకిస్థాన్ వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓడింది. బుధవారం జరిగిన మూడో టీ20లోనూ సమష్టిగా విఫలమైన పాకిస్థాన్ 45 పరుగల తేడాతో చిత్తయ్యింది. ఈ ఘోర పరాజయంతో ఐదు టీ20ల సిరీస్ను మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే 0-3తో కోల్పోయింది.
టీ20 కెప్టెన్గా సారథ్య బాధ్యతలు స్వీకరించిన షాహిన్ అఫ్రిదికు వరుసగా హ్యాట్రిక్ పరాజయాలే ఎదురయ్యాయి. టీ20ల్లో కెప్టెన్గా తొలి మూడు మ్యాచ్లు ఓడిన పాకిస్థాన్ ప్లేయర్గా షాహిన్ అఫ్రిది చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన షాహిన్ అఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఈ ఫలితాలతో పని లేదని, జట్టుగా విజయం కోసం ప్రయత్నించామా? లేదా? అనేది ముఖ్యమని తెలిపాడు. బాబర్ ఆజామ్కు ఇతర బ్యాటర్లు సహకారం అందించి ఉంటే ఈ మ్యాచ్లో విజయం సాధించేవాళ్లమని చెప్పాడు. 'ఈ ఫలితాలను పట్టించుకోం. జట్టుగా విజయం కోసం పోరాడమా? లేదా? అనేది ముఖ్యం. మా జట్టులోని అందరూ ఆటగాళ్లు అద్భుతంగా పోరాడారు.
ప్రతీ ఒక్కరు మా విజయం కోసం కష్టపడ్డారు. గెలుపు కోసం ప్రతీ ఒక్కరూ ఎలా మెరుగుపడగలమో గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సిరీస్లో బాబర్ ఆజామ్ తన సత్తా ఏంటో చూపించాడు. మూడు మ్యాచ్ల్లో అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడాడు. కానీ అతను మ్యాచ్ను ముగించలేకపోయాడు. గేమ్ను డీప్గా తీసుకెళ్లేందుకు ఎవరికైనా మరో ఎండ్లో సహకారం లభించాలి.
మరో ఎండ్లో బాబర్ ఆజామ్కు సహకారం లభించి ఉంటే అతను మ్యాచ్ను ముగించేవాడు.'అని షాహిన్ అఫ్రిది చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 224 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిన్ అలెన్(62 బంతుల్లో 5 ఫోర్లు, 16 సిక్స్లతో 137)శతక్కొట్టాడు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, జమాన్ ఖాన్, మహమ్మద్ నవాజ్, మహమ్మద్ వాసీమ్ తలో వికెట్ తీయగా.. హ్యారీస్ రౌఫ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 179 పరుగులే చేసి ఓటమిపాలైంది. బాబర్ ఆజామ్(37 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 58) హాఫ్ సెంచరీ మినహా మరే బ్యాటర్ రాణించలేదు. న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ రెండు వికెట్లు తీయగా.. మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధీ తలో వికెట్ తీసారు.