వెస్టిండీస్ పర్యటనలో పాకిస్థాన్కు అనూహ్య పరాజయం ఎదురైంది. ఆతిథ్య వెస్టిండీస్తో మూడు టీ20ల సిరీస్ను గెలుపుతో ప్రారంభించిన పాకిస్థాన్.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకునే అవకాశాన్ని కోల్పోయింది. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ 2 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఆఖరి బంతి వరకు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో షాహిన్ షా అఫ్రిది చేసిన చిన్న తప్పిదం పాకిస్థాన్ కొంపముంచింది. జాసన్ హోల్డర్ ఆఖరి బంతిని బౌండరీకి తరలించి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 133 పరుగులు చేసింది. హసన్ నవాజ్(40), సల్మాన్ అఘా(38), ఫకార్ జమాన్(20) టాప్ స్కోరర్లుగా నిలిచారు. విండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్(4/19) నాలుగు వికెట్లు తీయగా.. గుడకేష్ మోతీ రెండు వికెట్లు పడగొట్టాడు. అకీల్ హోస్సేన్, షమార్ జోసెఫ్, రోస్టన్ ఛేజ్ తలో వికెట్ తీసారు.

అనంతరం వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 135 పరుగులు చేసింది. గుడకేష్ మోతే(28), కెప్టెన్ షై హోప్(21) టాప్ స్కోరర్లుగా నిలిచారు. జాసన్ హోల్డర్(16 నాటౌట్) విన్నింగ్ షాట్తో విజయాన్నందించాడు. పాకిస్థాన్ బౌలర్లలో మహమ్మద్ నవాజ్(3/14) మూడు వికెట్లు తీయగా.. సయిమ్ ఆయుబ్(2/20) రెండు వికెట్లు పడగొట్టాడు. షాహిన్ షా అఫ్రిది, సుఫియన్ ముఖీల్ చెరో వికెట్ తీసారు.
ఆఖరి ఓవర్లో వెస్టిండీస్ విజయానికి 8 పరుగులు అవసరమయ్యాయి. కట్టు దిట్టంగా బౌలింగ్ చేసిన షాహిన్ షా అఫ్రిది.. ఐదు బంతుల్లో ఓ వికెట్ తీయడంతో పాటు నాలుగు పరుగులే ఇచ్చాడు. దాంతో ఆఖరి బంతికి విండీస్ 4 పరుగులు చేయాల్సి వచ్చింది. పాక్ విజయం లాంఛనమేనని అంతా అనుకున్నారు. కానీ షాహిన్ అఫ్రిది ఆఖరి బంతిని వైడ్ వేసి ఘోర తప్పిదం చేశాడు. దాంతో విండీస్కు అదనపు పరుగుతో పాటు ఎక్స్ట్రా బాల్ లభించింది.
చివరి బంతిని హోల్డర్ బౌండరీ బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఆ బంతి వైడ్ వేయకుండా అఫ్రిది కట్టు దిట్టంగా వేసి ఉంటే పాక్ విజయం సాధించేది. కానీ అతని తప్పిదం విండీస్కు కలిసొచ్చింది. ఈ మూడు మ్యాచ్ల సిరీస్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. నిర్ణయాత్మక మూడో టీ20 సోమవారం జరగనుంది. ఈ పర్యటనలో పాకిస్థాన్ మూడు టీ20లతో పాటు మూడు వన్డేల సిరీస్ ఆడనుంది.