పాకిస్థాన్ జట్టు తమకు ఏ మాత్రం పోటీ కాదని, ఎలాంటి రైవలరీ లేదని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్న సంగతి తెలిసిందే. ఆసియా కప్ 2025 టోర్నీలో పాకిస్థాన్ను రెండు సార్లు ఓడించిన నేపథ్యంలో సూర్య ఈ వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఈ కామెంట్స్పై పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది స్పందించాడు. ఫైనల్లో చూసుకుందామని సవాల్ విసిరాడు.
ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా శ్రీలంకతో జరిగిన సూపర్-4 మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో షాహీన్ అఫ్రిది (3/28) మూడు వికెట్లతో రాణించాడు. ఈ మ్యాచ్ అనంతరం అఫ్రిది ముందు సూర్య వ్యాఖ్యలను ప్రస్తావించగా తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. తాము ఆసియా కప్ ఆడటానికి మాత్రమే వచ్చామని, టైటిల్ గెలవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశాడు.

'సూర్య ఏది అనాలనుకుంటే అది అననివ్వండి. అతనికో పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. ప్రస్తుతం భారత్ ఇంకా ఫైనల్ చేరలేదు. మేమూ కూడా ఫైనల్ చేరేలేదు. ఒకవేళ మేం ఫైనల్కు చేరుకుంటే అప్పుడు చూసుకుంటాం. మేం ఇక్కడికి వచ్చింది ఆసియా కప్ 2025 టోర్నీ ఆడటానికి, గెలవటానికి, దానిపైనే మేం ఫోకస్ పెడతాం'అని తెలిపాడు.
ఈ టోర్నీలో లీగ్ దశలో పాకిస్థాన్ను 7 వికెట్ల తేడాతో ఓడించిన భారత్.. సూపర్-4లో 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ వరుస పరాజయాల నేపథ్యంలోనే సూర్యకుమార్ యాదవ్.. ఇరు దేశాల మధ్య ఎలాంటి రైవలరీ లేదని స్పష్టం చేశాడు. 'మీరు ఇకపై రైవలరీ గురించి అడగడం ఆపాలి. ఒకవేళ రెండు జట్లు 15-20 మ్యాచ్లు ఆడి, స్కోర్ లైన్ 7-7 లేదా 8-7 అయితే దాన్ని మీరు రైవలరీ అంటారు. కానీ స్కోర్ లైన్ 10-1 లేదా 13-0 అయితే, నాకు కరెక్ట్ స్టాట్స్ తెలియదు, కానీ ఇది ఇకపై రైవలరీ కాదు.' అని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు.
బంగ్లాదేశ్తో మరికాసేపట్లో జరిగే సూపర్-4 మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తే.. ఫైనల్ బెర్త్ ఖరారు అవుతోంది. మరోవైపు పాకిస్థాన్ ఫైనల్ చేరాలంటే బంగ్లాదేశ్తో జరిగే తమ చివరి సూపర్ 4 మ్యాచ్లో గెలవాలి. అదే జరిగితే భారత్, పాకిస్థాన్ మూడోసారి తలపడుతాయి. ఆసియా కప్ చరిత్రలోనే భారత్, పాక్ ఇప్పటి వరకు ఫైనల్లో తలపడలేదు.