పల్లెకెలె: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను క్లీన్ బౌల్డ్ చేయడాన్ని తెగ ఎంజాయ్ చేశానని పాకిస్థాన్ పేసర్ షాహిన్ అఫ్రిది తెలిపాడు. ఆసియాకప్ 2023లో భాగంగా భారత్తో శనివారం జరిగిన మ్యాచ్లో షాహిన్ అఫ్రిది నిప్పులు చెరిగాడు. అసాధారణ బౌలింగ్తో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీని వరుస ఓవర్లలో బౌల్డ్ చేసిన అఫ్రిది.. చివరి స్పెల్లో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాల వికెట్లను సాధించాడు.
మొత్తం 10 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లతో భారత్ బ్యాటింగ్ పతనాన్ని శాసించాడు. అయితే వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయ్యింది. టీమిండియా ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో పాకిస్థాన్ బ్యాటింగ్ సాధ్యమవ్వలేదు. దాంతో కటాఫ్ టైమ్ వరకు వేచి చూసిన అంపైర్లు చివరకు మ్యాచ్ను రద్దు చేసి చెరో పాయింట్ కేటాయించారు.

తన బౌలింగ్ ప్రదర్శనపై అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన షాహిన్ అఫ్రిది సంతోషం వ్యక్తం చేశాడు. 'కొత్త బంతితో త్వరగా వికెట్లు తీయాలనేది మా ప్రణాళిక. ప్లాన్కు తగ్గట్లు వికెట్లు తీసాం. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వికెట్లు చాలా కీలకం. అలాంటిది ఈ ఇద్దరినీ క్లీన్ బౌల్డ్ చేయడం సంతోషాన్నిచ్చింది.
మరీ ముఖ్యంగా రోహిత్ శర్మ వికెట్ను ఎంజాయ్ చేశా.
పేసర్లుగా మా జట్టు ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేసి ఫలితం రాబట్టాం. నసీమ్ షా 150 కి.మీ వేగంతో నిలకడగా బౌలింగ్ చేస్తున్నాడు. కొత్త బంతితో స్వింగ్ వస్తుండటంతో పరుగులు చేయడం కష్టమే. అయితే, చేజింగ్లో కాస్త నిలదొక్కుకుని బంతి పాతబడే వరకు వేచి చూస్తే పరుగులు చేయొచ్చు. కానీ, వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోవడం కాస్త నిరాశకు గురి చేసింది'అని షాహిన్ అఫ్రిది చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 48.5 ఓవర్లలో266 పరుగులకు కుప్పకూలింది. ఇషాన్ కిషన్(81 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 82), హార్దిక్ పాండ్యా(90 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 87) అసాధారణ ఇన్నింగ్స్ ఆడారు. ఐదో వికెట్కు 138 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని అందించారు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది నాలుగు వికెట్లు తీయగా.. హ్యారీస్ రౌఫ్, నసీమ్ షా మూడేసి వికెట్లు తీసారు.
ఆసియాకప్ చరిత్రలోనే పేసర్లే 10 వికెట్లు తీయడం ఇదే తొలిసారి. అంతకుముందు 9 వికెట్లు తీసిన రికార్డు కూడా పాకిస్థాన పేరిటే ఉంది. 2004 ఆసియా కప్లో బంగ్లాదేశ్పై షోయబ్ అక్తర్, షబ్బిర్ అహ్మద్, సమీ మూడేసి వికెట్లు తీశారు. భారత పేసర్లు కూడా శ్రీలంకపై 1984లో ఎనిమిది వికెట్లు తీశారు. ఇందులో చేతన్ శర్మ, మదన్లాల్ మూడేసి వికెట్లు తీయగా.. మనోజ్ ప్రభాకర్ రెండు వికెట్లు పడగొట్టాడు.