కోల్కతా నైట్రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ను ఆ జట్టు ఓనర్ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఓదార్చాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 2 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్ను జోస్ బట్లర్ పోరాటం కారణంగా చేజార్చుకుంది.
ఈ ఓటమి నేపథ్యంలో కేకేఆర్ ఆటగాళ్లంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. సునీల్ నరైన్ శతకం సాధించిన మ్యాచ్లో ఈ అనూహ్య ఓటమిని జీర్ణించుకోలేకపోయారు. కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్తో పాటు జట్టు ఆటగాళ్లంతా మౌనంగా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లిపోయారు. కేకేఆర్ ఆటగాళ్లు బాధపడుతున్న విషయాన్ని గ్రహించిన ఆ జట్టు ఓనర్ షారుఖ్ ఖాన్.. డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లి వారిని ఓదార్చాడు.

స్పూర్తిదాయకమైన మాటలతో వారిలో ఉత్సాహాన్ని నింపాడు. ముఖ్యంగా గౌతమ్ గంభీర్కు బాధపడవద్దని సూచించాడు. 'క్రీడల్లోనైనా.. జీవితంలోనైనా కొన్నిసార్లు ఓటమికి మనం ఏ మాత్రం అర్హులం కాదు. కొన్నిసార్లు విజయానికి కూడా అర్హులం కాదు. కానీ ఈ రోజు మనం గెలవాల్సింది. జట్టులోని అందరూ అసాధారణ ప్రదర్శన కనబర్చారు.
ప్రతీ కేకేఆర్ అభిమాని తలెత్తుకునేలా ఆడారు. కాబట్టి ఎవరూ కూడా బాధపడవద్దు. నిరాశ చెందవద్దు. డ్రెస్సింగ్ రూమ్లో ఎప్పటిలానే ఉత్సాహంగా ఉండండి. ఇక్కడో ఎంతో శక్తి ఉంది. ఈ శక్తినే మనం మైదానంలోకి తీసుకెళ్లాలి. నాతో సహా జట్టులోని ప్రతీ ఒక్కరి మధ్య మంచి బంధం ఉంది. ఈ స్నేహపూర్వక వాతవారణాన్ని ఇలానే కొనసాగించండి.
ఆల్ది బెస్ట్.. ఈ రోజు గర్వపడే ప్రదర్శన కనబర్చారు. అందరూ బాగా ఆడారు. నేను ప్రత్యేకంగా పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. గౌతమ్ గంభీర్.. మీరు ఏ మాత్రం బాధపడకండి. మనం మళ్లీ పుంజుకుంటాం. రింకూ సింగ్ చెప్పినట్లు ఈ రోజు మన ఓటమి దేవుడి ప్రణాళిక. ముందు ముందు మంచి ప్రణాళికలతో బరిలోకి దిగుదాం.'అని షారుఖ్ ఖాన్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 223 పరుగులు చేసింది. సునీల్ నరైన్(56 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్స్తో 109) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. రఘు వంశీ(18 బంతుల్లో 5 ఫోర్లతో 30), రింకూ సింగ్(9 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 20 నాటౌట్) రాణించారు
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్, కుల్దీప్ సేన్ రెండేసి వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 224 పరుగులు చేసి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. జోస్ బట్లర్ (60 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్లతో 107 నాటౌట్) ఒంటరి పోరాటానికి రియాన్ పరాగ్(14 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 34), రోవ్మన్ పోవెల్(13 బంతుల్లో 26) సహకారం అందించారు. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తీ తలో రెండు వికెట్లు తీసారు. వైభవ్ అరోరాకు ఓ వికెట్ దక్కింది.