ముంబై: బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్కు చెందిన కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) గ్రూప్ అమెరికాలో మేజర్ లీగ్ క్రికెట్లో పెట్టుబడులు పెట్టింది. ఆ దేశంలో త్వరలో ఆరంభం కాబోయే ఓ భారీ క్రికెట్ లీగ్లో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా క్రికెట్ ఎంటర్ప్రైజెస్ (ఏస్) అనే సంస్థతో షారుక్ చేతులు కలిపాడు. అగ్రదేశంలో క్రికెట్ అభివృద్ధి కోసం ఈ పెట్టుబడులు పెట్టామని షారుక్ తెలిపాడు.
'నైట్రైడర్స్ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేసేందుకు కృషి చేస్తున్నాం. ఆసియా దేశాల తర్వాత క్రికెట్ను ఎక్కువగా అభిమానించే వారి సంఖ్య అమెరికాలో అధికంగా ఉంది. ఇందులో భాగంగా భవిష్యత్లో అక్కడ జరిగే క్రికెట్ పోటీల్లో భాగస్వాములు అవుతున్నందుకు సంతోషంగా ఉంది' అని షారుక్ పేర్కొన్నాడు. షారుక్తో పాటు కేకేఆర్ యజమానుల్లో ఒకరైన జూహీచావ్లా కూడా ఏస్ సంస్థతో కలిసి పనిచేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఇక, ప్రస్తుతం ఐపీఎల్లో కేకేఆర్తో పాటు కరీబియన్ ప్రీమియర్ లీగ్లో ట్రిన్బాగో నైట్రైడర్స్ జట్లకు షారుఖ్ యజమానిగా వ్యవహరిస్తున్నాడు. అమెరికాలో ప్రారంభమయ్యే లీగ్లో లాస్ఏంజెల్స్ ఫ్రాంచైజీని షారుక్ దక్కించుకునే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
అమెరికా క్రికెట్లో కొనుగోలు చేసిన టీమ్ లాస్ఎంజెల్స్కు ప్రాతినిథ్యం ఇస్తుందని, లాస్ఎంజెల్స్ నైట్రైడర్స్గా బరిలోకి దిగుతుందని కేకేఆర్ వర్గాలు తెలిపాయి. కరీబీయన్ ప్రీమియర్ లీగ్ 2020 చాంపియన్గా ట్రిన్ బాగో నైట్రైడర్స్ నిలవగా.. ఐపీఎల్ 2020 సీజన్లో మాత్రం కేకేఆర్ ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిబాట పట్టింది.