
లక్నో: ఇప్పటికే మూడు టీ20ల సిరీస్ను 0-2తో కోల్పోయిన భారత మహిళలకు నామమాత్రమైన ఆఖరి టీ20లో ఓదార్పు విజయం దక్కింది. సౌతాఫ్రికా మహిళలతో మంగళవారం జరిగిన ఆఖరి మ్యాచ్లో తాత్కలిక సారథి స్మృతి మంధాన నేతృత్వంలోని భారత మహిళల జట్టు 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బౌలింగ్లో రాజేశ్వర్ గైక్వాడ్ రఫ్ఫాడించగా.. అనంతరం బ్యాటింగ్లో ఓపెనర్లు స్మృతి మంధాన(28 బంతుల్లో 9 ఫోర్లతో 48 నాటౌట్), షెఫాలీ వర్మ(30 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 60) చెలరేగడంతో భారత్ సునాయస విజయాన్నందుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 112 పరుగులకే పరిమితమైంది. రాజేశ్వరి ధాటికి 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన సఫారీ మహిళలు.. కెప్టెన్ సునె లుజ్ (28), లారా (25) ఆదుకోవడంతో గౌరవ ప్రధమైన స్కోర్ చేయగలిగారు. అనంతరం లక్ష్యచేధనలో ఆరంభం నుంచి భారత్ దూకుడుగా ఆడింది. మెరుపు షాట్లు ఆడిన ఓపెనర్లు షెఫాలీ, మంధాన తొలి వికెట్కు 96 పరుగులు జోడించి జట్టును విజయపథంలో నడిపించారు. షెఫాలీ 26 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. ఆమె వెనుదిరిగినా.. హర్లీన్ (4)తో కలిసి మంధాన జట్టును విజయతీరాలకు చేర్చింది. భారత్ 11 ఓవర్లలోనే ఒక్క వికెటే కోల్పోయి లక్ష్యాన్ని అందుకోవడం విశేషం.