శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్లో భారత మహిళల జైత్రయాత్ర కొనసాగుతోంది. మంగళవారం వైజాగ్ వేదికగా జరిగిన రెండో టీ20లోనూ సమష్టిగా చెలరేగిన భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలింగ్లో తెలుగు తేజం శ్రీచరణి (2/23) నిప్పులు చెరిగితే.. బ్యాటింగ్లో షెఫాలీ వర్మ(34 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్తో 69 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీతో రాణించి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 128 పరుగులు చేసింది. కెప్టెన్ చమరి ఆటపట్టు(24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 31), హర్షిత్ సమరవిక్రమా(32 బంతుల్లో 4 ఫోర్లతో 33) టాప్ స్కోరర్లుగా నిలవగా.. హాసిని పెరారా(28 బంతుల్లో 3 ఫోర్లతో 22) కాస్త ఫర్వాలేదనిపించింది. భారత బౌలర్లలో శ్రీచరణితో పాటు వైష్ణవి శర్మ(2/32) రెండేసి వికెట్లు తీయగా.. క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా తలో వికెట్ తీసారు.

అనంతరం భారత్ 11.5 ఓవర్లలో 3 వికెట్లకు 129 పరుగులు చేసి సునాయాస విజయాన్నందుకుంది. షెఫాలీ వర్మ అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. జెమీమా రోడ్రిగ్స్(15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 26) పర్వాలేదనిపించింది. స్మృతి మంధాన(14), హర్మన్ప్రీత్ కౌర్(10) నిరాశపర్చగా.. రిచా ఘోష్(1 నాటౌట్) సాయంతో షెఫాలీ వర్మ విజయలాంఛనాన్ని పూర్తి చేసింది. భారత సమష్టి ప్రదర్శనతో ఈ మ్యాచ్ కూడా ఏకపక్షంగా ముగిసింది. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్లో భారత్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. మూడో టీ20 శుక్రవారం తిరువనంతపురం వేదికగా జరగనుంది.