ప్రపంచకప్ విజయంలో భాగం కావాలని, జట్టుకు ఏదైనా మంచి చేయాలనే ఆ దేవుడు తనను ఈ మ్యాచ్ ఆడించాడని టీమిండియా యువ ఓపెనర్ షెఫాలీ వర్మ తెలిపింది. జట్టులోకి వచ్చిన రోజే తాను ఈ మాట చెప్పానని, ఈ రోజు అది నిరూపితమైందని సంతోషం వ్యక్తం చేసింది. మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో టీమిండియా విజేతగా నిలిచింది. ఆదివారం నవీ ముంబై వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన హర్మన్సేన 52 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఎన్నో ఏళ్ల తమ కలను సాకారం చేసుకుంది.
ఈ మ్యాచ్లో షెఫాలీ వర్మ(87, 2/36) ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. దాంతో ఆమెకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ వరించింది. వాస్తవానికి ఈ టోర్నీకి షెఫాలీ వర్మ ఎంపికవ్వలేదు. సెమీఫైనల్కు ముందు ప్రతికా రావల్ గాయపడటంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చింది. సెమీస్లో విఫలమైనా.. ఫైనల్లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చింది.

ఈ విజయానంతరం అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన షెఫాలీ వర్మ.. తనకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది. 'నేను జట్టులోకి వచ్చినప్పుడే చెప్పాను. జట్టు మేలు కోరే ఆ దేవుడు నన్ను పంపించాడని. అది ఈ రోజు నిరూపితమైంది. ఈ ప్రపంచకప్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. నాపై నాకు చాలా నమ్మకం ఉంది. నేను కాస్త ప్రశాంతంగా ఉంటే ఏదైనా సాధించగలను. నా తల్లి దండ్రలులు, స్నేహితులు, సోదరుడు.. అందరూ నాకు అండగా నిలిచారు. ఎలా ఆడాలి అనేదానిపై నాకు అవగాహన కల్పించారు.
ఈ విజయం నా జట్టుకు నాకు చాలా ముఖ్యమైనది. నా జట్టు గెలిపించాలని మాత్రమే అనుకున్నాను. నా మనసు స్పష్టంగా ఉంచుకున్నాను. నా ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేశాను. స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్ నాకు అండగా నిలిచి ప్రోత్సహించారు. నీ ఆటను నువ్వు ఆడమని చెప్పారు. ఇలాంటి క్లారిటి లభిస్తే ఆటగాళ్లు రాణించగలరు. ఇది అద్భుతమైన క్షణం. సచిన్ టెండూల్కర్ క్రికెట్ మాస్టర్. ఆయనను చూస్తే నాకు ఎంతో స్ఫూర్తి కలుగుతుంది. నేను ఆయనతో తరుచూ మాట్లాడుతుంటాను. ఆయన నాకు ఎప్పుడూ ధైర్యం చెబుతుంటారు.'అని షెఫాలీ వర్మ చెప్పుకొచ్చింది.