మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్లో భారత బ్యాటర్లు దుమ్ము రేపారు. దాంతో సఫారీ ముందు భారత్ 299 పరుగుల భారీ లక్ష్యం నమోదు చేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ(78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 87), దీప్తి శర్మ(58 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 58 ) హాఫ్ సెంచరీలతో రాణించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 298 పరుగులు చేసింది.
స్మృతి మంధాన(58 బంతుల్లో 8 ఫోర్లతో 45), రిచా ఘోష్(24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 34) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఖాక(3/58) మూడు వికెట్లు తీయగా.. మ్లబా, డిక్లెర్క్, ట్రయాన్ తలో వికెట్ తీసారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ విధ్వంసకర బ్యాటింగ్తో తొలి వికెట్కు 104 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. పవర్ ప్లేను అద్భుతంగా వాడుకున్న ఈ జోడీ 64 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించింది. హాఫ్ సెంచరీ ముంగిట స్మృతి మంధాన(45)ను ట్రయాన్ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చింది. క్రీజులోకి జెమీమా రాగా.. షెఫాలీ వర్మ తన జోరును కొనసాగించింది. 49 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది.

56 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సునె లూస్ బౌలింగ్లో షెఫాలీ ఇచ్చిన సునాయస క్యాచ్ను బోచ్ నేలపాలు చేసింది. ఈ అవకాశంతో షెఫాలీ చెలరేగింది. మరో ఎండ్లో జెమీమా స్లోగా ఆడినా.. షెఫాలీ వేగంగా పరుగులు రాబట్టింది. సెంచరీ దిశగా సాగిన షెఫాలీ వర్మ అనవసర షాట్తో వికెట్ పారేసుకుంది. ఖాఖా బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగింది. దాంతో రెండో వికెట్కు నమోదైన 62 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ఆ వెంటనే ఖాఖా బౌలింగ్లోనే జెమీమా కూడా క్యాచ్ ఔట్గా వెనుదిరిగింది. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ అద్భతంగా క్యాచ్ అందుకుంది. ఈ పరిస్థితుల్లో హర్మన్ప్రీత్ కౌర్, దీప్తి శర్మ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆచితూచి ఆడిన ఈ జోడీ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. 52 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీని మ్లబా విడదీసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్(20)ను క్లీన్ బౌల్డ్ చేసింది. క్రీజులోకి వచ్చిన అమన్ జోత్ కౌర్(12) త్వరగానే వెనుదిరిగింది. దాంతో భారత్ 245 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది.
ఈ పరిస్థితుల్లో రిచా ఘోష్తో కలిసి దీప్తి శర్మ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించింది. రిచా భారీ సిక్స్లతో విరుచుకు పడగా దీప్తి శర్మ క్లాస్ బ్యాటింగ్ కొనసాగించింది. ఈ క్రమంలో 53 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో రిచా క్యాచ్ ఔట్గా వెనుదిరిగింది. దాంతో 6వ వికెట్కు నమోదైన 47 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆఖరి బంతికి దీప్తి శర్మ రనౌట్గా వెనుదిరిగడంతో భారత్ 300 పరుగుల మార్క్ను అందుకోలేకపోయింది.