టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఓ వైపు ప్రశంసల జల్లు కురుస్తుంటే.. మరోవైపు విమర్శలు వస్తున్నాయి. ఓ వర్గం అభిమానులు, మాజీ క్రికెటర్లు కోహ్లీ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆకస్మాత్తుగా టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలకడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. కనీసం మరో రెండేళ్లు అయినా కోహ్లీ టెస్ట్ ఫార్మాట్లో కొనసాగాల్సిందని కామెంట్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ సోమవారం టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా కోహ్లీ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. టెస్ట్ క్రికెట్ తనకు ఎన్నో పాఠాలు నేర్పిందని, ఎంతో ఇచ్చిందన్నాడు. సంతోషంగా ఈ ఫార్మాట్ను తప్పుకుంటున్నానని తెలిపాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బాటలోనే విరాట్ కోహ్లీ నడిచాడు. ఇటీవలే రోహిత్ శర్మ సైతం టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. సెలెక్టర్ల సూచనలతోనే అతను రిటైర్మెంట్ ప్రకటించాడని వార్తలు వచ్చాయి. రోహిత్ రిటైర్మెంట్ అయిన వెంటనే కోహ్లీ కూడా తప్పుకుంటాడని ప్రచారం జరిగింది. కానీ బీసీసీఐ అతన్ని కొనసాగాలని రిక్వెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ కోహ్లీ ఆటకు అల్విదా ప్రకటించాడు.

బీసీసీఐ తీరు నచ్చకనే..
ఉన్నట్టుండి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీసీసీఐ తీరుకు విసిగిపోయే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడని కొందరంటే.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ టార్చర్ తట్టుకోలేకనే గుడ్బై చెప్పాడని మరికొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం కుటుంబానికి ఎక్కువ సమయం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడని కామెంట్ చేస్తున్నారు. అనుష్క శర్మ ఒత్తిడి కారణంగానే విరాట్ కోహ్లీ ఆట నుంచి తప్పుకున్నాడని పోస్ట్లు పెడుతున్నారు. తన ఇద్దరు పిల్లలు పెరుగుతుండటంతో.. వారితో ఎక్కువ సేపు గడపాలని విరాట్ భావించాడనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
పెళ్లాం, పిల్లలు ఎక్కువ..?
అయితే కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించి భారత జట్టును క్లిష్ట పరిస్థితుల్లో వదిలేసాడని, అతని స్థానాన్ని భర్తీ చేసే టెస్ట్ బ్యాటర్ లేరని కామెంట్ చేస్తున్నారు. కోహ్లీ ఇంత స్వార్ధపరుడని అనుకోలేదని, దేశం కంటే అతనికి కుటుంబమే ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అయితే కోహ్లీకి ఆటపై ప్రేమ తగ్గిందని, పెళ్లాం ఎక్కువైపోయిందని ఘాటుగా విమర్శిస్తున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సైతం కోహ్లీ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశాడు. ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చిందని ప్రశ్నించాడు. కోహ్లీ నిర్ణయం సరికాదని అభిప్రాయపడ్డాడు. అనిల్ కుంబ్లే, ఇర్ఫాన్ పఠాన్, వీరేంద్ర సెహ్వాగ్ల సైతం కోహ్లీ నిర్ణయం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు.