ఓ మీడియా ప్రతినిథిపై టీమిండియా టీ20 కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'మీరు జర్నలిస్ట్లా.. స్క్రిప్ట్ రైటర్లా'అని మండిపడ్డాడు. తనపై తప్పుడు కథనాలను ప్రచురించారని సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేశాడు.
అసలు విషయం ఏంటంటే..?
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టును వీడుతున్నట్లు వార్తలు వచ్చాయి. వచ్చే సీజన్ నుంచి అతను గోవాకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఈ విషయాన్ని జైస్వాల్ కూడా అంగీకరించాడు. గోవా జట్టు కెప్టెన్సీ ఆఫర్ ఇవ్వడంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్కు తాను ఎంతో రుణపడి ఉంటానని కూడా చెప్పాడు. జాతీయ జట్టు తరఫున మ్యాచ్లు లేనప్పుడు గోవా తరఫున దేశవాళీ మ్యాచ్లు ఆడుతానని తెలిపాడు.

అయితే యశస్వి జైస్వాల్తో పాటు ముంబై జట్టులోని ఇతర ఆటగాళ్లతో కూడా గోవా క్రికెట్ అసోసియేషన్ టచ్లో ఉందని ఓ మీడియా కథనాన్ని ప్రచురించింది. అందులో సూర్యకుమార్ యాదవ్ కూడా ముంబై జట్టును వీడేందుకు సిద్దమయ్యాడని పేర్కొంది. ఈ కథనంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సూర్యకుమార్ యాదవ్.. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ను షేర్ చేస్తూ సదరు జర్నలిస్ట్పై మండిపడ్డాడు. కామెడీ సినిమాలు చూడటం మానేసి ఇలాంటి వార్తలు చదవడం మొదలుపెడుతానని సెటైర్లు పేల్చాడు.
'నువ్వు స్క్రిప్ట్ రైటరా? జర్నలిస్ట్వా..? ఇక నుంచి నవ్వుకోవాలంటే కామెడీ సినిమాలు చూడటం మానేసి ఈ ఆర్టికల్స్ చదవడం మొదలుపెట్టాలి. ఇదో చెత్త కథనం' అని సూర్యకుమార్ యాదవ్ ట్వీట్ చేశాడు. సూర్య విమర్శలతో సదరు మీడియా సంస్థ ఈ ఆర్టికల్ను అప్డేట్ చేసింది. సూర్యకుమార్ యాదవ్ ఈ వార్తలను ఇంకా ధృవీకరించలేదని పేర్కొంది.