టీమిండియా వెటరన్ క్రికెటర్ సౌరభ్ తివారి ప్రొఫెషనల్ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. జార్ఖండ్కు చెందిన 34 ఏళ్ల తివారి.. రంజీ ట్రోఫీ 2024లో తన జట్టు ప్రస్థానం ముగిసిన అనంతరం ఈ నిర్ణయాన్ని వెల్లడించాడు. హర్యానాతో జరిగిన తన ఆఖరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో జార్ఖండ్ 205 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో జార్ఖండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
దాంతో సౌరభ్ తివారి ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. జాతీయ జట్టుకు... ఐపీఎల్కు ఆడనప్పుడు ఆటను కొనసాగించడం వృథా అని సౌరభ్ తివారి అభిప్రాయపడ్డాడు. తాను తప్పుకుంటే కుర్రాళ్లకైనా అవకాశం వస్తుందని చెప్పుకొచ్చాడు. టీమిండియా టెస్ట్ టీమ్లో కుర్రాళ్లకు చోటుదక్కే అవకాశం ఉందని, అందుకే తాను ఆట నుంచి వైదొలిగి వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నానని తెలిపాడు.

17 ఏళ్ల పాటు దేశవాళీ క్రికెట్లో కొనసాగిన తివారి.. భారత్ తరఫున మూడు వన్డేలు.. ఐపీఎల్లో నాలుగు ఫ్రాంచైజీల తరఫున 93 మ్యాచ్లు ఆడాడు. అచ్చం ధోనీలా లాంగ్ హెయిర్ స్టైల్ మెయింటేన్ చేసిన సౌరభ్ తివారి అప్పట్లో జూనియర్ ధోనీగా గుర్తింపు పొందాడు.
ఐపీఎల్ 2010 సీజన్లో ముంబై తరఫున మెరుపులు మెరిపించిన సౌరభ్ తివారి.. ఆ సీజన్లో 419 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. కానీ మూడు మ్యాచ్ల్లో దారుణంగా విఫలమై 49 పరుగులే చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో విఫలమైనా.. దేశవాళీలో సత్తా చాటాడు.
115 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 22 శతకాలతో 8030 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ గెలిచిన అండర్ 19 ప్రపంచకప్ 2008 జట్టులోనూ తివారి సభ్యుడు. ఈ క్రమంలోనే 2011 సీజన్లో ఆర్సీబీ అతని కోసం భారీ ధరను వెచ్చింది. అతను మాత్రం దారుణంగా విఫలమయ్యాడు.
తన చివరి రంజీ మ్యాచ్లోనూ 23, 3 పరుగులే చేశాడు. మణిపూర్తో జరిగిన గత మ్యాచ్లో మాత్రం అజేయ శతకం సాధించాడు.