న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టును ఉద్దేశించి పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సర్ఫరాజ్ నవాజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పిచ్చి ప్రయోగాలతో జట్టును నాశనం చేశారని తెలిపాడు. ఆసియాకప్, వన్డే ప్రపంచకప్ టోర్నీలకు సమయం ఆసన్నమైనా టీమ్ కాంబినేషన్లో స్పష్టత లేదన్నాడు. ప్రస్తుత భారత జట్టు కంటే పాకిస్థాన్ జట్టు ఎంతో బలంగా ఉందని అభిప్రాయపడ్డాడు.
ఇక టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమ్ కాంబినేషన్ను పదే పదే మార్చారు. వర్క్లోడ్ మేనేజ్మెంట్ పేరిట తరుచూ కెప్టెన్లను మారుస్తూ ఆడారు. సరైన కాంబినేషన్ లేక టీ20 ప్రపంచకప్ 2022లో మూల్యం చెల్లించుకున్నారు. ఆసియాకప్, వన్డే ప్రపంచకప్ సమీపిస్తున్నా.. ప్రయోగాల పేరిట టీమ్ కాంబినేషన్పై క్లారిటీ ఇవ్వడం లేదు.

విండీస్తో వన్డే సిరీస్లోనూ అనేక ప్రయోగాలు చేసి సీనియర్ల ఆగ్రహానికి గురయ్యారు. ఇప్పటికీ మిడిలార్డ్ చాలా బలహీనంగా ఉందని మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు. ఇదే విషయంపై మాట్లాడిన సర్ఫరాజ్ నవాజ్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. టీమిండియా కంటే పాకిస్థాన్ బలంగా ఉందని, నిలకడైన ప్రదర్శన కనబరుస్తోందని చెప్పాడు.
'ఇప్పటికీ టీమిండియా కాంబినేషన్ సెట్ అవ్వలేదు. ఆసియాకప్ మరో కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. అయినా, టీమిండియా మిడిలార్డర్లో ఎవరు ఉంటారు? ఎవరు ఆడుతారు? అనే విషయాలపై సందిగ్దత కొనసాగుతూనే ఉంది. కెప్టెన్లు మారుతూ వస్తున్నారు. ఆటగాళ్ల కాంబినేషన్ ఇంకా కుదరలేదు. కొత్త ఆటగాళ్లను ఇంకా ప్రయత్నిస్తున్నారు.
అలాగే ఐసీసీ ట్రోఫీని నెగ్గి పదేళ్లవుతుందనే విషయం కూడా ఆటగాళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. స్వదేశంలో జరగనుండటం కూడా అదనపు ఒత్తిడికి గురి చేస్తోంది. అయితే కొందరు సీనియర్ ఆటగాళ్లు మంచి ఫామ్లో ఉండటం భారత్కు కలిసిరానుంది.'అని సర్ఫరాజ్ నవాజ్ చెప్పుకొచ్చాడు.
ఆగస్ట్ 30 నుంచి ఆసియాకప్ మొదలవ్వనుండగా.. అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ గాయాల నేపథ్యంలో మిడిలార్డర్లో ఎవరు ఆడుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. విండీస్ పర్యటనలో నిలకడగా రాణిస్తున్న తిలక్ వర్మను తీసుకోవాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.