అధిక బరువుతో ఉన్న తనను సహచర ఆటగాళ్లంతా పాండా అంటూ వెక్కిరించేవారని టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అన్నాడు. ఫిట్గా లేకపోవడంతోనే క్రికెటర్గా తదుపరి స్థాయికి ఎదగలేకపోతున్నావని విరాట్ కోహ్లీ తన ముఖం మీదే చెప్పేసాడని గుర్తు చేసుకున్నాడు. బరువు తగ్గి ఫిట్గా మారడం సంతోషంగా ఉందని తెలిపాడు. సర్ఫరాజ్ ఖాన్..కఠినమైన డైట్, వ్యాయమంతో రెండు నెలల వ్యవధిలోనే 17 కిలోల బరువు తగ్గాడు. బియ్యం బస్తాలా ఉండే సర్ఫరాజ్ ఖాన్.. ప్రస్తుతం కరెంట్ తీగలా సన్నగా మారాడు.
తన బాడీ ట్రాన్స్ఫార్మెషన్కు సంబంధించిన ఫొటోలను సర్ఫరాజ్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ ఫొటో నెట్టింట వైరల్గా మారింది. సర్ఫరాజ్ ఖాన్ బాడీ ట్రాన్స్ఫార్మెషన్ను చూసి ఫ్యాన్స్ అవాక్కయ్యారు. తాజాగా తన ట్రాన్స్ఫార్మెషన్ గురించి మాట్లాడిన సర్ఫరాజ్ ఖాన్.. భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనే లక్ష్యంతోనే ఫిట్గా మారానని తెలిపాడు.

'కేవలం ఫిట్గా మారినందుకే కాదు.. పరుగులు సాధిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఒకానొక సమయంలో నేను బాగా తినేవాడిని. దాంతో నా సహచర ఆటగాళ్లంతా నన్ను 'పాండా' అని పిలిచేవారు. ఇప్పుడు వారు నన్ను 'మాచో' అని పిలుస్తున్నారు. వాస్తవానికి ఇది నా కొత్త నిక్నేమ్ అని చాలా మందికి తెలియదు.
2019లో నేను ఫిట్గా లేననే ఏకైక కారణంతోనే ఆర్సీబీ జట్టు నుంచి తొలగించారు. నా నైపుణ్యాల పట్ల ఎలాంటి సందేహం లేదని, ఫిట్గా లేకపోవడం వల్లే తదుపరి స్థాయికి చేరలేకపోతున్నానని విరాట్ కోహ్లీ నా ముఖంపైనే చెప్పేసాడు. కోహ్లీ భాయ్ తన అభిప్రాయాన్ని నాతో చాలా నిజాయితీగా చెప్పాడు.'అని సర్ఫరాజ్ ఖాన్ చెప్పుకొచ్చాడు.
2015లో ఆర్సీబీ తరఫున ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్.. మూడు సీజన్ల పాటు జట్టులో కొనసాగాడు. రూ. 50 లక్షల ధరతో ఆర్సీబీ జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్.. 17 ఏళ్ల వయసులోనే ఈ క్యాష్ రిచ్ లీగ్ ఆడిన పిన్నవయస్కుడిగా రికార్డ్ సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్తో తన అరంగేట్ర మ్యాచ్లో 7 బంతుల్లో 11 పరుగులు చేశాడు. 2015లో రాజస్థాన్ రాయల్స్పై 21 బంతుల్లో అజేయంగా 45 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత సర్ఫరాజ్ ఖాన్కు విరాట్ కోహ్లీ గౌరవ వందనం చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. 2019 వేలానికి ముందు ఆర్సీబీ.. సర్ఫరాజ్ ఖాన్ వదిలేయగా.. పంజాబ్ కింగ్స్ రూ.25 లక్షలకు కొనుగోలు చేసింది.
ఐపీఎల్ 2020 సీజన్ కూడా అదే జట్టులో కొనసాగిన సర్ఫరాజ్ ఖాన్..తదుపరి సీజన్లో అన్సోల్డ్గా నిలిచాడు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో సర్పరాజ్ ఖాన్ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.20 లక్షల కొనుగోలు చేసింది. రెండు సీజన్ల పాటు ఆడిన అతను మెరుగైన ప్రదర్శన చేయలేదు. దాంతో తుది జట్టులో చోటు దక్కించుకోలేదు. గత రెండు సీజన్లలో అన్సోల్డ్గా నిలిచాడు. మొత్తం 50 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన సర్ఫరాజ్ ఖాన్ 22.50 సగటుతో 585 పరుగులే చేశాడు. ఇందులో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ ఉంది. ఐపీఎల్లో విఫలమైనా.. దేశవాళీ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన చేసి భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్న సర్ఫరాజ్ ఖాన్ను గాయాలు వెంటాడాయి. దాంతో అతను భారత జట్టులో చోటు కోల్పోయాడు. రీఎంట్రీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.