టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఫిట్నెస్పై ఫోకస్ పెట్టాడు. భారత టెస్ట్ టీమ్లో తన స్థానాన్ని పదిలం చేసుకోవడమే లక్ష్యంగా సిద్దమవుతున్నాడు. ఇప్పటికే ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత్-ఏ జట్టులో చోటు దక్కించుకున్న అతను.. అధిక బరువును తగ్గించుకునే పనిలో పడ్డాడు. ఇప్పటికే సర్ఫరాజ్ ఖాన్ 10 కిలోల బరువు తగ్గాడు. కఠినమైన ఆహార నియమాలతో సన్నగా మారాడు. ప్రస్తుతం సర్ఫరాజ్ ఖాన్కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. పాత ఫొటోలతో ప్రస్తుత ఫొటోలను పోల్చుతూ.. నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కఠినమైన డైట్తో..
అన్నం, గోధుమలతో చేసిన ఆహారాన్ని పూర్తిగా పక్కనపెట్టిన సర్పరాజ్ ఖాన్.. ఉడకబెట్టిన చికెన్, గుడ్లు, కూరగాయాలు మాత్రమే తింటున్నాడు. తక్కువ మోతాదులో ఆలివ్ ఆయిల్ ఉపయోగిస్తున్నాడు. సర్ఫరాజ్ ఖాన్తో పాటు తమ కుటుంబం మొత్తం బరువు తగ్గడంపై ఫోకస్ పెట్టిందని అతని తండ్రి నౌషద్ ఖాన్ తెలిపాడు. 'మా కుటుంబం మొత్తం బరువు తగ్గడంపై ఫోకస్ పెట్టింది. సర్ఫరాజ్ ఖాన్ 6 వారాల్లో 9 కిలోల బరువు తగ్గాడు. అది అంత సులువైన పని కాదు. అతను ఇంకా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నాడు.

సర్ఫరాజ్ ఖాన్, నేను ముంబై క్రికెట్ అసోసియేషన్ జిమ్లో క్రమం తప్పకుండా శిక్షణ పొందాము. మేం అక్కడ ప్రతీ రోజు ఒక గంట పాటు వారానికి ఆరు రోజులు ప్రాక్టీస్ చేసాము. ఆ తర్వాత అక్కడి స్టేడియంలో కొంత వాకింగ్ చేశాను. సర్ఫరాజ్ ఖాన్ మాత్రం రన్నింగ్ చేసేవాడు. ఆ తర్వాత 30 నిమిషాల పాటు స్విమ్మింగ్ చేసాం. నా చిన్న కొడుకు మొయిన్ ఖాన్ కూడా చాలా బరువు తగ్గాడు.
ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్..
మేం గోధుమ పిండి, బియ్యాన్ని పూర్తిగా పక్కనపెట్టాం. ఉడికించిన చికెన్, గుడ్లు, కూరగాయాలను మాత్రమే తింటున్నాం. గ్రీన్ టీతో పాటు బ్లాక్ కాఫీ తాగుతున్నాం. తక్కువ మోతాదులో ఆలివ్ నూనెను ఉపయోగిస్తున్నాం.'అని నౌషద్ ఖాన్ చెప్పుకొచ్చారు. నౌషద్ ఖాన్ పర్యవేక్షణలో సర్ఫరాజ్ ఖాన్ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ను ప్రాక్టీస్ చేస్తున్నాడు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించినా.. సర్ఫరాజ్ ఖాన్కు అవకాశాలు దక్కలేదు. అధిక బరువే అతనికి అవకాశాలు రాకుండా చేసింది.
ఆస్ట్రేలియా పర్యటనలో సర్ఫరాజ్ ఖాన్ పక్కటెముకల గాయానికి గురయ్యాడు. ఫిట్గా లేకపోవడంతో ఐపీఎల్ 2025 మెగా వేలంలో అన్సోల్డ్గా నిలిచాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో.. టెస్ట్ టీమ్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భావించిన సర్ఫరాజ్ ఖాన్ ముందుగా ఫిట్నెస్పై ఫోకస్ పెట్టాడు. సొంతగడ్డపై న్యూజిలాండ్తో తొలి టెస్ట్లో 150 పరుగులు చేసి సత్తా చాటిన సర్ఫరాజ్ ఖాన్.. ఆ తర్వాత రెండు టెస్ట్ల్లో విఫలమయ్యాడు. భారత్-ఏ తరఫున ఇంగ్లండ్ పర్యటనలో సత్తా చాటితే సర్ఫరాజ్ ఖాన్కు తుది జట్టులో చోటు దక్కనుంది.