
కరాచీ: పేలవ ఫామ్, వరుస వైఫల్యాలతో కెప్టెన్సీతో పాటు జట్టులో చోటు కోల్పోయిన పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ రీఎంట్రీకి రెడీ అయ్యాడు. ఇంగ్లండ్ పర్యటనకు 29 మంది క్రికెటర్లతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసిన జట్టులో ఈ మాజీ కెప్టెన్ చోటు దక్కించుకున్నాడు. ఇక ముందస్తు చర్యల్లో భాగంగా ఈ 29 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 10 మందికి పాజిటీవ్ రావడం.. అనంతరం మరో ఆరుగురికి నెగటీవ్ రావడం తెలిసిందే. అయితే ఈ గందరగోళం నేపథ్యంలో ఆ పదిమందిని పక్కన పెట్టిన పీసీబీ.. రిజర్వ్ ఆటగాళ్లతో కలుపుని 20 మంది సభ్యులు జట్టును నేడు(ఆదివారం) ఇంగ్లండ్ పంపించింది.
ఇక సర్ఫరాజ్ అహ్మద్కు రెండు సార్లు పరీక్షలు నిర్వహించగా నెగటీవ్ వచ్చింది. దీంతో ఈ పాక్ మాజీ కెప్టెన్ ఇంగ్లండ్ బయల్దేరాడు. పీసీబీ ఎంపిక చేసిన జట్టులో మరో వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ కరోనా బారిన పడటంతో సర్ఫరాజ్ రీఎంట్రీ ఖాయమనిపిస్తుంది. ఈ పర్యటనకు ముందు.. 2017 చాంపియన్స్ ట్రోఫీ గెలిచి మూడేళ్లు అయిన సందర్భంగా సర్ఫరాజ్ ఓ చానెల్కు ఇంటర్యూ ఇచ్చాడు. ఈ సందర్బంగా ఫేవరెట్ హీరోయిన్స్ గురించి చర్చ వచ్చింది. పాక్, భారత్లో ఫేవరేట్ హీరోయిన్లు ఎవరని ప్రశ్నించగా.. సర్ఫరాజ్ పాక్లో మెహివిష్ హయత్, అయేజ ఖాన్ అని బదులిచ్చాడు. బాలీవుడ్లో కత్రీనా కైఫ్, దీపికా పదుకొణెలో ఎవరు ఇష్టమని అడగ్గా.. కత్రినా కైఫ్ అంటే ఇష్టమని వెల్లడించాడు.

ఇక బాలీవుడ్ హీరోయిన్స్ను పాకిస్థాన్ క్రికెటర్లు ఇష్టపడటం కొత్తేమీ కాదు. గతంలో ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్.. సోనాలీ బింద్రేపై మనసు పారేసుకున్నాడు. అప్పట్లో సోనాలిని కిడ్నాప్ చేయాలని కూడా తాను అనుకున్నట్లు ఆ మధ్య అక్తర్ వెల్లడించాడు.