
10 ఓవర్ల పాటు..
క్రికెట్ చరిత్రలోనే ఓ గొప్ప మ్యాచ్గా నిలిచి పోయిన ఈ టెస్ట్ను నాటి పాకిస్థాన్ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్ జరిగిన తీరును నదిర్ అలీ పోడ్కాస్ట్లో పంచుకున్నాడు. ఈ మ్యాచ్లో సచిన్ టెండూల్కర్.. తాను వేసిన తొలి 10 ఓవర్లలో ఒక్క షాట్ కూడా ఆడలేదని చెప్పాడు. తన బౌలింగ్ తీరును నిశితంగా పరిశీలించిన మాస్టర్.. ఆ తర్వాత విరుచుకుపడ్డాడని గుర్తు చేసుకున్నాడు. 'భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన చెన్నై టెస్ట్ పాక్ క్రికెట్ చరిత్రలోనే గొప్ప మ్యాచ్. ఇది నెంబర్ వన్ మ్యాచ్. తొలి ఇన్నింగ్స్లో సచిన్ టెండూల్కర్ను నా రెండో బంతికే ఔట్ చేశా.

బౌలింగ్ ట్రిక్స్ చూసి..
రెండో ఇన్నింగ్స్లో అత్యంత కీలక సమయంలో సచిన్ బ్యాటింగ్కు వచ్చాడు. నేను వేసిన తొలి 10 ఓవర్లు సచిన్ ఒక్క షాట్ కూడా ఆడలేదు. నా బౌలింగ్ ట్రిక్స్ను నిశితంగా పరిశీలించాడు. నేను వేసే ఆఫ్ స్పిన్, దూస్రా, టాప్ స్పిన్, ఆర్మ్ బాల్, క్వికర్ ఆఫ్ బ్రేక్, ఫ్లైటెడ్ డెలివరీలు 10-12 ఓవర్లపాటు సచిన్ బాగా రీడ్ చేశాడు. ఆ తర్వాత నాపై ఎదురుదాడికి దిగాడు. నేను వెంటనే మా కెప్టెన్ వసీమ్ అక్రమ్ దగ్గరకు వెళ్లి..'వసీం భాయ్ అతను నా బౌలింగ్ను బాగా రీడ్ చేస్తున్నాడు. నాకు బదులు వేరే బౌలర్తో బౌలింగ్ చేయించండి'అని చెప్పాను.

అక్రమ్ భాయ్దే క్రెడిట్
అక్రమ్ మాత్రం'బ్రదర్.. ఏ పర్వాలేదు. ఈ ఎండ్ నుంచి నువ్వే బౌలింగ్ చేయాలి. ఇతరులను నమ్మే పరిస్థితుల్లో నేను లేను. నీవల్ల ఈ మ్యాచ్ మనవైపు టర్న్ అయ్యింది.'అని చెప్పాడు. ఈ మ్యాచ్ గెలుపు క్రెడిట్ వసీం అక్రమ్కే ఇస్తాను. అతను నాతో అలా అనకుండా బౌలింగ్ మార్చుంటే ఫలితం మాకు అనుకూలంగా ఉండేది కాదు. తర్వాతి 10-12 ఓవర్లు నా బౌలింగ్లో ఒక్క వేరియేషన్ చూపించలేదు. సాధారణ ఆఫ్ స్పిన్ మాత్రం వేసాను. దానికి తగ్గట్లు ఫీల్డ్ సెట్ చేసుకున్నాను.

దూస్రాతోనే బోల్తా కొట్టించా..
దాంతో సచిన్ గత 10 ఓవర్లుగా చూసిన నా వేరియేషన్స్ అన్ని మరిచిపోయాడు. సచిన్ స్ట్రైక్లో ఉన్నప్పుడూ.. నాన్ స్ట్రైక్లో నిలబడ్డప్పుడు కూడా ఒక్క దూస్రా వేయలేదు. నా వేరియేషన్స్ అన్ని మరిచిపోయాడని గ్రహించిన తర్వాత అక్రమ్ దగ్గరకు వెళ్లి ఇప్పడు సచిన్ను ఔట్ చేస్తానని చెప్పాను. అప్పటికే సచిన్ 16-17 బౌండరీలు కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత్ విజయానికి 37 పరుగులు అవసరమవ్వగా ఐదు వికెట్లు చేతులో ఉన్నాయి. అప్పుడు నేను దూస్రా వేయగా.. సచిన్ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని గాల్లోకి లేచింది. వసీం అక్రమ్ ఎలాంటి తప్పిదం లేకుండా క్యాచ్ అందుకున్నాడు.'అని సక్లయిన్ ముస్తాక్ వివరించాడు. సచిన్ ఔటైన తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయిన భారత్ 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.


Click it and Unblock the Notifications












