Sanju Samson: టీమిండియా స్టార్ ఓపెనర్ సంజూ శాంసన్ మరోసారి బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నమీబియాతో న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన సంజూ శాంసన్ 22 పరుగులే చేసి వెనుదిరిగాడు.
అభిషేక్ శర్మ అనారోగ్యంతో అనూహ్యంగా తుది జట్టులో చోటు దక్కించుకున్న సంజూ శాంసన్.. బంగారం లాంటి అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. 8 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 275 స్ట్రైక్రేట్ ఆడిన సంజూ శాంసన్.. భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. టీమిండియా దూకుడైన అప్రోచ్ తగ్గట్లు ఆడినా.. క్రీజులో సెట్ అయిన తర్వాత అనవసర షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. తనకు లభించిన ఆరంభాన్ని భారీ ఇన్నింగ్స్గా మార్చి ఉంటే సంజూ శాంసన్ తుది జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేవాడు.

ఈ క్రమంలోనే సంజూ శాంసన్పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'సంజూ.. నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా.. నువ్వు మారవు'అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాస్త ఓపికగా ఆడి ఉంటే ఏం జరిగేదని నిలదీస్తున్నారు. మోషన్స్ ఏమైనా పెట్టాయా? అంత ఉరుకులాట ఎందుకని మండిపడుతున్నారు. కాస్త ఓపికగా ఆడి ఉంటే సొమ్ము ఏమైనా పోయేదా? అని కామెంట్ చేస్తున్నారు. సంజూ శాంసన్ తన షాట్ సెలెక్షన్పై సీరియస్గా ఫోకస్ పెట్టాలని హితవు పలుకుతున్నారు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడిన భారత్ బ్యాటింగ్కు దిగగా.. ఓపెనర్లు సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ విధ్వంసకర ఆరంభాన్ని అందించారు. 12 బంతుల్లోనే తొలి వికెట్కు 25 పరుగులు జోడించారు. నమీబియాతో మ్యాచ్లో సంజూ విఫలమైనా.. పాకిస్థాన్తో మ్యాచ్లో మరో అవకాశం దక్కనుంది.
కనీసం ఆ మ్యాచ్లోనైనా ఆడాలని ఫ్యాన్స్ హితవు పలుకుతున్నారు. కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్న అభిషేక్ శర్మ.. పూర్తిగా కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందని, అతను ఒకటి రెండు మ్యాచ్లు దూరమయ్యే అవకాశం ఉందని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ఈ క్రమంలోనే పాక్తో మ్యాచ్లో కూడా సంజూ శాంసనే ఓపెనర్గా ఆడనున్నాడు. కనీసం ఈ మ్యాచ్లోనైనా రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.