ఆసియా కప్ 2025 కోసం ఎంపిక చేసిన భారత జట్టులోకి శుభ్మన్ గిల్ రీఎంట్రీ ఇవ్వడంతో సంజూ శాంసన్ స్థానంపై సందేహాలు తలెత్తాయి. శుభ్మన్ గిల్కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా దక్కడంతో అతను తుది జట్టులో ఆడటం ఖాయమైంది. శుభ్మన్ గిల్ గైర్హాజరీలో ఓపెనర్గా ఆడిన సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 10 ఇన్నింగ్స్ల్లో 3 శతకాలు నమోదు చేశాడు. కానీ గిల్ రీఎంట్రీతో సంజూను ఓపెనర్గా కొనసాగించలేని పరిస్థితి నెలకొంది. అతన్ని మిడిలార్డర్లో ఆడిస్తారా? లేక బెంచ్కే పరిమితం చేస్తారా? అనే చర్చ జోరుగా సాగుతోంది.
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ భారత జట్టులో సంజూ పాత్ర ఏంటని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను ప్రశ్నించగా ఆసక్తికర సమాధానమిచ్చాడు. సంజూ గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదని, అతన్ని తాము బాగా చూసుకుంటామని తెలిపాడు. 'సర్.. మా తుది జట్టు వివరాలను మీకు మెసేజ్ చేస్తాను. మేము సంజూ శాంసన్ను బాగా చూసుకుంటున్నాం. అతని గురించి మీరు చింతించకండి. రేపు( బుధవారం యూఏఈతో మ్యాచ్) సరైన నిర్ణయం తీసుకుంటాం.'అని సూర్య బదులిచ్చాడు.

అతని మాటలు యూఏఈతో మ్యాచ్లో సంజూ శాంసన్ బరిలోకి దిగుతాడనే సంకేతాన్నిస్తున్నాయి. మంగళవారం అందరి కన్నా ముందే ప్రాక్టీస్ సెషన్కు వచ్చిన సంజూ శాంసన్ వికెట్ కీపింగ్ డ్రిల్స్ చేశాడు. ఈ లెక్కన అతను తొలి మ్యాచ్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాకిస్థాన్తో మ్యాచ్లో దూకుడుగానే ఉంటామని సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. దూకుడుగా లేకుంటే క్రీడల్లో కొనసాగలేమన్నాడు. యూఏఈతో మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఉన్నామని చెప్పాడు. ఈ టోర్నీ కోసం అన్ని విధాల సిద్దమయ్యామని సూర్య పేర్కొన్నాడు.
బుధవారం యూఏఈతో జరిగే తొలి మ్యాచ్తో టీమిండియా తమ క్యాంపైన్ను ప్రారంభించనుంది. సెప్టెంబర్ 14న పాకిస్థాన్తో హై ఓల్టేజ్ మ్యాచ్ ఆడనున్న భారత్, సెప్టెంబర్ 19న ఒమన్తో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. సెప్టెంబర్ 20 నుంచి సూపర్ -4 మ్యాచ్లు జరగనుండగా.. సెప్టెంబర్ 28న జరిగే ఫైనల్తో ఈ టోర్నీకి తెరపడనుంది.