
20 వేల బంతుల్ని ఎదుర్కొన్నా
రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. అయితే ఐపీఎల్ కోసం తాను ఎలా సన్నద్ధమయ్యాననే విషయాల్ని సంజూ వెల్లడించాడు. 'లాక్డౌన్ సమయంలో నా వెంటే ఉన్న వారందరికీ థాంక్స్. ప్రత్యేకంగా నా మెంటార్ రఫీ గోమెజ్కు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నా దూకుడు వెనుక కఠోర శ్రమ ఉంది. లాక్డౌన్ సమయంలో గోఫెజ్తో కలిసి ఎన్నో గంటలు ప్రాక్టీస్ చేశా. సుమారు 20 వేల బంతుల్ని ఎదుర్కొన్నా. అవన్నీ అతనే వేశారు. గత ఆరు నెలలుగా నా బ్యాటింగ్ మెరుగుపడటానికి కారణం గోమెజ్. నా కష్టానికి ఫలితమే.. తొలి మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నా' అని సంజూ తెలిపాడు.

టెర్రస్ పైనే ప్రాక్టీస్
రఫీ గోమెజ్ మాట్లాడుతూ... 'లాక్డౌన్ సమయంలో ప్రాక్టీస్ చేయడం చాలా కష్టమనే విషయం అందరికీ తెలుసు. సాధ్యమైనన్ని ఎక్కువ సౌకర్యాలు మాకు అందుబాటులో లేవు. మా టెర్రస్ పైనే సంజూ శాంసన్ చేత ప్రాక్టీస్ చేయించా. నేను బంతుల్ని విసరడంతో.. వాటి నుంచి శాంసన్ మెళుకవలు నేర్చుకున్నాడు. శాంసన్ చాలా కఠినపరిస్థితిని ఎదుర్కొన్నాడు. ప్రాక్టీస్ కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. ప్రాక్టీస్ చేయడమే పరమావధిగా భావించాడు' అని చెప్పాడు. గతంలో కేరళ రంజీ జట్టుకు కెప్టెన్గా చేసిన గోమెజ్.. శాంసన్కు మెంటార్గా వ్యవహరిస్తున్నాడు.

6-7 గంటలు ప్రాక్టీస్ చేసేవాళ్లం
'నేను భిన్నరకాలైన బంతులతో సంజూ శాంసన్ చేత ప్రాక్టీస్ చేయించా. ప్రధానంగా బౌన్సర్లు, యార్కర్లుతో పాటు రకరకాల బంతుల్ని శాంసన్కు వేశా. లాక్డౌన్ సమయంలో శాంసన్ ప్రాక్టీస్ ఇలా సాగింది. బంతిని బ్యాలెన్స్ చేస్తూ ఆడటాన్ని నేర్చుకున్నాడు. రోజూ 6 నుంచి 7 గంటలు ప్రాక్టీస్ చేసేవాళ్లం. అర్థరాత్రి శాంసన్ను నిద్రలోంచి లేపి ప్రాక్టీస్ చేసినా.. చెడ్డ బంతుల్ని సిక్స్లుగా మలిచే సామర్థ్యం ఉండాలనే చెబుతూ ప్రాక్టీస్ చేయించాను. చెన్నైతో జరిగిన మ్యాచులో బాగా ఆడాడు. చాలా సంతోషంగా ఉంది' అని రఫీ గోమెజ్ పేర్కొన్నాడు. గోమెజ్ మంచి ఆల్రౌండర్.

2015లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసినా
ఐపీఎల్, దేశవాళీ క్రికెట్లో పరుగుల మోత మోగించే సంజు శాంసన్కు దురదృష్టవశాత్తు అంతర్జాతీయ క్రికెట్లో రావాల్సిన అవకాశాలు రాలేదు. ఇక రాక రాక వచ్చిన అవకాశాల్లో అతను నిరూపించుకోలేకపోయాడు. 2015 జింబాబ్వేతో జరిగిన టీ20 ద్వారా భారత జట్టులోకి వచ్చిన శాంసన్.. మరో అవకాశం కోసం నాలుగేళ్లు వేచి చూడాల్సి వచ్చింది. గతేడాది బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు ఎంపికైనా.. తుది జట్టులో చోటు దక్కలేదు. బెంచ్కే పరిమితమయ్యాడు. అయితే ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్తో జరిగిన రెండు టీ20ల్లో తుది జట్టులో చోటు దక్కించుకున్న శాంసన్.. వరుసగా 8, 2 పరుగులు చేశాడు.


Click it and Unblock the Notifications

Dean Jones: ఆస్ట్రేలియన్ క్రికెట్ లెజెండ్ మృతి!!










