ఆసియా కప్ 2025 ప్రారంభానికి ముందు టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సంజూ శాంసన్.. టీమ్ మేనేజ్మెంట్కు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. సంజూ శాంసన్కు ఆసియాకప్ తుది జట్టులో చోటు కష్టమే అని చర్చ జరుగుతున్న సమయంలో ఈ కేరళ బ్యాటర్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. కేరళ క్రికెట్ లీగ్లో 42 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సంజూ బౌలర్లను ఊచకోత కోసాడు.
తన బ్యాటింగ్తో టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్తో పాటు మేనేజ్మెంట్కు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాడు. తనలో ఇంకా ఫైర్ ఉందని, తప్పకుండా తుది జట్టులో కొనసాగించాలనే విషయాన్ని తెలియజేశాడు. కేరళ క్రికెట్ లీగ్ 2025లో కొచ్చి బ్లూ టైగర్స్కు సారథ్యం వహిస్తున్న సంజూ శాంసన్.. కొల్లమ్ సెయిలర్స్ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్లో సెంచరీ సాధించాడు. 236 పరుగుల భారీ లక్ష్యచేధనలో ఓపెనర్గా బరిలోకి దిగిన సంజూ శాంసన్.. 51 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్లతో 121 పరుగులు చేసి ఔటయ్యాడు. 237.25 స్ట్రైక్రేట్తో సంజూ బ్యాటింగ్ చేయడం విశేషం. ఇక ముహమ్మద్ ఆషిక్ ఆఖరి బంతిని సిక్సర్గా తరలించి సంజూ టీమ్కు చిరస్మరణీయ విజయాన్నందించాడు.

ఈ విధ్వంసకర శతకం ద్వారా తనను ఓపెనర్గానే కొనసాగించాలనే విషయాన్ని సంజూ డిమాండ్ చేశాడు. ఆసియాకప్ 2025 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో సంజూ శాంసన్కు అవకాశం దక్కింది. కానీ అతన్ని తుది జట్టులో కొనసాగించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్.. మీడియా సమావేశంలో వెల్లడించాడు. సంజూ శాంసన్ జట్టులో ఉన్నప్పటికీ ఓపెనర్గా శుభ్మన్ గిల్ ఆడుతాడని హింట్ ఇచ్చాడు. గిల్, యశస్వి జైస్వాల్ టీ20 ఫార్మాట్కు అందుబాటులో లేకపోవడంతోనే సంజూ శాంసన్ ఓపెనర్గా ఆడాడని, అది అతని పర్మినెంట్ ప్లేస్ కాదని అగార్కర్ చెప్పుకొచ్చాడు. మరోవైపు అభిషేక్ శర్మ ఓపెనర్గా సత్తా చాటాడని, అతని చేరికతో జట్టుకు బౌలింగ్ ఆప్షన్ పెరుగుతుందన్నాడు.
అయితే భారత్ తరఫున గత 10 ఇన్నింగ్స్ల్లో సంజూ శాంసన్ ఓపెనింగ్ చేసి మూడు శతకాలు సాధించాడు. కానీ గిల్ రాకతో అతన్ని ఓపెనింగ్ ఆడిస్తారా? అనేది సందేహంగా మారింది. ఒకవేళ గిల్ ఓపెనింగ్ చేస్తే సంజూ శాంసన్ బెంచ్కు పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లోయరార్డర్లో సంజూ కంటే వికెట్ కీపర్గా జితేష్ శర్మ బాగా సెట్ అవుతాడు. మరీ హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఏం చేస్తాడో చూడాలి. ఇప్పటికే శ్రేయస్ అయ్యర్ను కాదని శుభ్మన్ గిల్ జట్టులోకి తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.