జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టులో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ పర్యటనలోని ఐదు టీ20ల సిరీస్ కోసం భారత సెలెక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఇప్పటికే ప్రకటించింది. శుభ్మన్ గిల్ను సారథిగా ఎంపిక చేసింది.
టీ20 ప్రపంచకప్ ఆడిన సీనియర్ ఆటగాళ్లందరినీ ఈ పర్యటనకు దూరంగా ఉంచిన సెలెక్షన్ కమిటీ.. ఆ టోర్నీలో బెంచ్కు పరిమితమైన యశస్వి జైస్వాల్, శివమ్ దూబే, సంజూ శాంసన్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్లను మాత్రం ఎంపిక చేసింది.

ఇప్పటికే శుభ్మన్ గిల్ సారథ్యంలోని కుర్రాళ్లతో కూడిన జట్టు మంగళవారమే జింబాబ్వేకు చేరుకుంది. అయితే భారీ తుఫాను కారణంగా ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు బార్బోడస్లోనే చిక్కుకుపోయింది. రోహిత్ సారథ్యంలోని ప్రపంచకప్ టీమ్ ఇంకా టీమిండియా రాలేదు. దాంతో ఈ జట్టులోనే ఉన్న శివమ్ దూబే, సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్లను జింబాబ్వే పర్యటన నుంచి తప్పిస్తున్న బీసీసీఐ తెలిపింది.
వీరి స్థానాల్లో తొలి రెండు టీ20లకు కేకేఆర్ యువ పేసర్ హర్షిత్ రాణా, సాయి సుదర్శన్, జితేశ్ శర్మలను ఎంపిక చేసింది. తొలి రెండు టీ20లు ముగిసిన అనంతరం శివమ్ దూబే, సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్ టీమిండియాతో కలుస్తారని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం బీసీసీఐ ఓ ప్రకటనను విడుదల చేసింది.
టీ20 ప్రపంచకప్ రిజర్వ్డ్ ప్లేయర్లుగా ఎంపికైన రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్లను మాత్రం తొలి రెండు టీ20లకు ఎంపిక చేశారు. ఈ ఇద్దరూ ప్రస్తుతం భారత జట్టుతో ఉన్నారా? లేక స్వదేశం వచ్చేసారా? అనేదానిపై క్లారిటీ లేదు. జూలై 6న తొలి టీ20, జూలై 7న రెండో టీ20 జరగనుండగా.. జూలై 10, 13, 14న చివరి మూడు టీ20లు జరగనున్నాయి.
జింబాబ్వేతో తొలి రెండు టీ 20లకు భారత జట్టు:
శుభ్మన్ గిల్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్పాండే, సాయి సుదర్శన్, జితేశ్ శర్మ(కీపర్), హర్షిత్ రాణా