రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్.. ఆ జట్టును వీడేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. సుదీర్ఘ కాలం పాటు ఆ జట్టుకు ఆడుతున్న సంజూ శాంసన్.. ఐపీఎల్ 2026 వేలానికి ముందు తనను వదిలేయాని ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2025 సీజన్ ముగిసిన వెంటనే సంజూ శాంసన్ తన నిర్ణయాన్ని వెల్లడించాడట. అయితే సంజూ విజ్ఞప్తిపై రాజస్థాన్ రాయల్స్ ఇంకా స్పందించలేదని తెలుస్తోంది.
ఒకవేళ సంజూ శాంసన్ను రాజస్థాన్ వదిలేయాలనుకుంటే అతన్ని ఇతర ఫ్రాంచైజీకి ట్రేడింగ్ చేయవచ్చు. లేదా వేలానికి వదిలేయవచ్చు. రూల్స్ ప్రకారం తుది నిర్ణయం ఫ్రాంచైజీదే. 30 ఏళ్ల సంజూ శాంసన్ మొదట 2013 నుంచి 2015 వరకు రాజస్థాన్ రాయల్స్కు ఆడాడు. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున రెండు సీజన్లు పాటు ఆడి రాజస్థాన్ రాయల్స్కు రీఎంట్రీ ఇచ్చాడు. 2021లో అతనికి జట్టు సారథ్య బాధ్యతలు కూడా దక్కాయి. అదే ఏడాది రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ కూడా చేరంది.

ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలానికి ముందు సంజూ శాంసన్ను రాజస్థాన్ రాయల్స్ రూ. 18 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకుంది. కెప్టెన్గా కొనసాగించింది. కానీ గాయం కారణంగా అతను 9 మ్యాచ్లే ఆడాడు. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ దారుణంగా విఫలమైంది. 14 మ్యాచ్ల్లో 4 మాత్రమే గెలిచిన ఆ జట్టు పాయింట్స్ టేబుల్లో 9వ స్థానంలో నిలిచింది. గాయం నుంచి కోలుకున్న తర్వాత కూడా రియాన్ పరాగ్ను కెప్టెన్గా కొనసాగించడం, జోస్ బట్లర్ను రిటైన్ చేసుకోకపోవడం వంటి విషయాల్లో రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యంతో సంజూకు విభేదాలు తలెత్తినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తో కూడా సంజూ శాంసన్కు సత్సంబంధాలు లేవని, ఈ క్రమంలోనే అతను జట్టు నుంచి తప్పుకోవాలనుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. మరోవైపు అతనికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫు నుంచి ఆఫర్ వచ్చిందని, ధోనీ వారసుడగా ఆ జట్టులోకి వెళ్లేందుకు సంజూ శాంసన్ ఆసక్తిగా ఉన్నాడని తెలుస్తోంది. ఇప్పటి వరకు 11 సీజన్లలో 149 మ్యాచ్లు ఆడిన సంజూ శాంసన్ 4027 పరుగులు చేశాడు.