వ్యక్తిగత ప్రదర్శన గురించి ఆలోచించకుండా జట్టు కోసం ఆడానని టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ అన్నాడు. తన ఫామ్ను ఉపయోగించుకొని సెంచరీ చేయగలిగానని తెలిపాడు. నాలుగు టీ20ల సిరీస్లో భాగంగా సౌతాఫ్రికాతో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా 61 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్లో సంజూ శాంసన్ సెంచరీతో చెలరేగాడు. అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్గా చరిత్రకెక్కాడు. శతకంతో విజయంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ అవార్డు అందుకున్న అనంతరం సంజూ శాంసన్ తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడాడు.

జట్టు కోసం ఆడాను..
'మిడిలార్డర్లో నా బ్యాటింగ్ ఆస్వాదించాను. బాగా ఆడాను. మీరు చెప్పినట్లు నా ప్రస్తుత ఫామ్ను కొనసాగిస్తున్నాను. మంచి ఉద్దేశంతో ఆడటంతోనే ఈ సెంచరీ చేయగలిగాను. దూకుడుగా ఆడటం.. వ్యక్తిగత ప్రదర్శన కంటే జట్టు కోసం ఆడాలని మా జట్టులో ఎప్పుడూ మాట్లాడుకుంటాం. మూడు-నాలుగు బంతులు ఆడగానే బౌండరీ కొట్టాలనిపిస్తోంది. కానీ ఈ రోజు నేను అలా ఆలోచించలేదు.
కొన్నిసార్లు బౌండరీలు వస్తే.. మరికొన్నిసార్లు రాలేదు. అయినా ఎక్కువ ఆలోచించకుండా నా బ్యాటింగ్ కొనసాగించాను. ఈ సిరీస్లో శుభారంభం చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే సొంతగడ్డపై సౌతాఫ్రికా ఎంత ప్రమాదకరమైనదో మాకు బాగా తెలుసు. మేం ఈ సిరీస్ శుభారంభం చేయడం సంతోషంగా ఉంది.'అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.
10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నా..
భారత బ్యాటింగ్ అనంతరం అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడుతూ.. సంజూ శాంసన్ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ క్షణం కోసం గత 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాని తెలిపాడు. 'నేను ఎక్కువగా ఆలోచిస్తే కన్నీళ్లు వస్తాయి. ఈ సక్సెస్ నాకు అంత సులువుగా దక్కలేదు. ఈ క్షణం కోసం నేను గత 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను.
ఇన్నాళ్లకు నేను కోరుకున్నది దక్కినందుకు సంతోసంగా ఉంది. గొప్పగా అదృష్టవంతుడిగా ఫీలవుతున్నాను. కానీ నా కాళ్లను నేను నేలపైనే ఉంచాలనుకుంటున్నాను. ఈ క్షణాన్ని ఆస్వాదిస్తూ నా ఫామ్ను కొనసాగించాలనుకుంటున్నాను.'అని సంజూ శాంసన్ భావోద్వేగానికి గురయ్యాడు.

భారత్ భారీ విజయం..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 202 పరుగుల భారీ స్కోర్ చేసింది. సంజూ శాంసన్(50 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్లతో 107) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. తిలక్ వర్మ(18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 33) దూకుడుగా ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయిట్జీ(3/37) మూడు వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, పీటర్, క్రుగర్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. హెన్రీచ్ క్లాసెన్(22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 25), ర్యాన్ రికెల్టన్(11 బంతుల్లో3 ఫోర్లు, సిక్స్తో 21), గెరాల్డ్ కోయిట్జీ(11 బంతుల్లో 3 సిక్స్లతో 23) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(3/25), రవి బిష్ణోయ్(3/28) మూడేసి వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. అర్ష్దీప్ సింగ్కు ఓ వికెట్ దక్కింది.