నాగ్పూర్: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఎదురైన ఓటమి తమకు ఓ గుణపాఠమని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అన్నాడు. పేలవ బ్యాటింగ్తో సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్లో ఓటమిపాలయ్యామని చెప్పాడు. బుధవారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ సమష్టిగా రాణించి 10 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ను ఓడించింది.
మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన సంజూ శాంసన్.. పేలవ బ్యాటింగ్తో గెలిచే మ్యాచ్లో ఓటమిపాలయ్యామని తెలిపాడు. 'ఈ ఓటమి చాలా బాధకు గురి చేసింది. జైపూర్లోని తమ తొలి మ్యాచ్లో విజయం సాధించాలనుకున్నాం. ఈ ఓటమి మాకు ఓ గుణపాఠం. ఈ మ్యాచ్ తప్పిదాల నుంచి మేం కచ్చితంగా పాఠాలు నేర్చుకుంటాం. మాకున్న బ్యాటింగ్ లైనప్ ప్రకారం ఈ లక్ష్యాన్ని సునాయసంగా చేధించాల్సింది.

కానీ లక్నో బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మైదాన పరిస్థితులకు తగ్గట్లు బౌలింగ్ చేశారు. ఈ వికెట్ నెమ్మదిగా ఉంటుందని ముందే ఊహించాం. 9వ ఓవర్ వరకు మ్యాచ్ మా చేతుల్లోనే ఉన్నట్లు అనిపించింది. జై స్వాల్ ఔటైన తర్వాత జట్టు పరిస్థితి క్లిష్టంగా మారింది. మరో భాగస్వామ్యం నమోదవ్వకుండా లక్నో బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.
బౌలింగ్లో మేం అసాధారణ ప్రదర్శన కనబర్చాం. 150 పరుగులకే పరిమితం చేశాం. మా బౌలింగ్ విభాగానికి ఈ మ్యాచ్ ఓ గుణపాఠం లాంటిది. ఈ ఓటమి నుంచి తేరుకొని వీలైనంత త్వరగా విజయాల బాట పట్టాలనుకుంటున్నాం.'అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 154 పరుగులు చేసింది. కైల్ మేయర్స్(42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 51) హాఫ్ సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్(32 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 39), నికోలస్ పూరన్(20 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 29) పర్వాలేదనిపించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, జాసన్ హోల్డర్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 144 పరుగులే చేసింది. యశస్వీ జైస్వాల్(35 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 44), జోస్ బట్లర్(41 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 40) రాణించినా ఫలితం లేకపోయింది. ఆవేశ్ ఖాన్ మూడు వికెట్లు, మార్కస్ స్టోయినీస్ రెండు వికెట్లతో రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించారు.