
కోల్కతా: కొన్ని ఎక్స్ట్రా పరుగులు.. ఒకరిద్దరి చెత్త ఓవర్లు గుజరాత్ టైటాన్స్ చేతిలో తమ ఓటమికి కారణమయ్యాయని రాజస్థాన్ రాయల్స్ సారథి సంజూ శాంసన్ అన్నాడు. మంగళవారం జరిగిన క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ను ఓడించి ఫైనల్కు చేరింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన సంజూ శాంసన్.. తమకు లక్ కలిసి రాలేదన్నాడు. టాస్ ఓడటం శాపంగా మారిందని, చేజింగ్లో పిచ్ బ్యాటింగ్కు మరింత అనుకూలించిందని తెలిపాడు. తమ బ్యాటింగ్ సమయంలో బంతి ఆగి రావడంతో పాటు అనూహ్య బౌన్స్, స్వింగ్ అయ్యిందని చెప్పిన సంజూ... దాంతో బ్యాటింగ్ చేయడం కష్టంగా మారిందన్నాడు. కానీ చేజింగ్లో మాత్రం పరిస్థితులు బ్యాటింగ్కు అనుకూలంగా మారాయని చెప్పుకొచ్చాడు.
'స్వింగ్, అనూహ్య బౌన్స్తో బ్యాటింగ్ కష్టంగా మారిన పరిస్థితుల్లో మేం పోరాడే లక్ష్యాన్నే ప్రత్యర్థి ముందు ఉంచాం. కానీ గుజరాత్ బ్యాటర్లు అద్భుతంగా ఆడి లక్ష్యాన్ని చేధించారు. తాను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా వికెట్ బ్యాటింగ్కు కష్టంగా కనిపించింది. కానీ అదృష్టవశాత్తు నేను పవర్ ప్లేలో పరుగులు రాబట్టగలిగాను. ఈ పరిస్థితుల్లో మేం నిర్థేశించిన లక్ష్యం కాపాడుకోదగినదే. పైగా మాకు అత్యుత్తమ బౌలింగ్ దళం ఉంది. మా ప్రధాన ఐదుగురు బౌలర్లు టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించారు. వారికి రియాన్ పరాగ్ సైతం సహకారం అందించాడు.
కానీ ఈ మ్యాచ్లో ఆ జోరు చూపట్టలేకపోయారు. పైగా వికెట్ కూడా సెకండ్ ఇన్నింగ్స్ టైమ్లో చాలా మారింది. బ్యాట్పైకి బంతి సులువుగా వచ్చింది. టోర్నీ ఆసాంతం మేం అద్భుత క్రికెట్ ఆడాం. కానీ ఈ మ్యాచ్లో కొన్ని ఓవర్లు, ఎక్స్ట్రారన్స్, ఒకరిద్దరూ బౌలర్ల వల్ల ఓటమి తప్పలేదు. అద్భుతమైన మా ఆట తీరుతో మరింత బలంగా కమ్ బ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఈ టీ20 ఫార్మాట్లో టాస్ గెలవడం చాలా ముఖ్యం. అప్పుడు అన్నీ మన కంట్రోల్లో ఉంటాయి. తదుపరి మ్యాచ్లో మాకు అనుకూల ఫలితం దక్కుతుందని ఆశిస్తున్నా'అని సంజూ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 188 పరుగులు చేసింది. జోస్ బట్లర్కు తోడుగా సంజూ శాంసన్(26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 47), దేవదత్ పడిక్కల్(20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 28) రాణించారు. గుజరాత్ బౌలర్లలో షమీ, యశ్ దయాల్, సాయి కిషోర్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 3 వికెట్లకు 191 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. మిల్లర్కు తోడుగా హార్దిక్ పాండ్యా(27 బంతుల్లో 5 ఫోర్లతో 40 నాటౌట్), శుభ్మన్ గిల్(21 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 35), మాథ్యూ వేడ్(30 బంతుల్లో 6 ఫోర్లతో 35) రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ఒబేడ్ మెక్కాయ్ తలో వికెట్ తీసారు.