తరౌబా: వెస్టిండీస్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించేందుకే తొలి బంతి నుంచే దూకుడుగా ఆడానని టీమిండియా వెటరన్ బ్యాటర్ సంజూ శాంసన్ అన్నాడు. వెస్టిండీస్తో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో భారత్ 200 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది.
మూడో వన్డేలో సంజూ శాంసన్(41 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 51)హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఎదుర్కొన్న తొలి బంతినే అటాక్ చేశాడు. రెండో బంతిని సిక్సర్గా మలిచాడు. చాలా రోజుల తర్వాత మళ్లీ టీమిండియా పిలుపును అందుకున్న సంజూ శాంసన్ మొదటి అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు.

రెండో వన్డేలో 9 పరుగులకే విఫలమయ్యాడు. అయినా ఏ మాత్రం బెరుకు లేకుండా మూడో వన్డేలో విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇదే విషయాన్ని ఇన్నింగ్స్ అనంతరం సంజూ శాంసన్ను ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పాడు. పుట్టిన దేశం కోసం పరుగులు చేయడం కన్నా సంతోషం మరొకటి ఉండదని చెప్పాడు.
బౌలర్లను డామినేట్ చేయడానికే అటాకింగ్ గేమ్ ఆడినట్లు చెప్పుకొచ్చాడు. 'భారత క్రికెటర్గా కొనసాగడం సవాల్తో కూడుకున్న పని. దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాను. 8-9 ఏళ్లుగా భారత జట్టు తరఫున వచ్చిన అవకాశాలను అందుకుంటున్నా. బ్యాటింగ్ ఆర్డర్లో నాకు ఓ స్థానమంటూ లేదు. కాబట్టి ఏ స్థానంలో ఆడాల్సి వచ్చినా సిద్దంగా ఉండాలని ఫిక్స్ అయ్యాను.
బ్యాటింగ్ స్థానం కంటే మనం ఎన్ని ఓవర్ల పాటు క్రీజులో ఉన్నదే ముఖ్యం. మిడిలార్డర్లో ఆడటం సంతోషంగా ఉంది. దేశం కోసం పరుగులు చేయడం సంతోషంగా ఉంది. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడటం ఇంటర్నేషనల్ అటెంప్ట్. ప్రత్యర్థి బౌలర్లను డామినేట్ చేసేందుకే అటాకింగ్ గేమ్ ఆడాను. 'అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 351 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్(64 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 77), శుభ్మన్ గిల్(92 బంతుల్లో 11 ఫోర్లతో 85), సంజూ శాంసన్(41 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 51), హార్దిక్ పాండ్యా(52 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 70 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్.. శార్దూల్ ఠాకూర్(4/37), ముకేష్ కుమార్(3/30), కుల్దీప్ యాదవ్(2/25) ధాటికి 35.3 ఓవర్లలో 151 పరుగులకే కుప్పకూలింది. జయదేవ్ ఉనాద్కత్ ఓ వికెట్ తీసాడు. వెస్టిండీస్ బ్యాటర్లలో అలిక్ అథనాజ్(50 బంతుల్లో 3 ఫోర్లతో 32), గుడకేష్ మోతీ(34 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 39) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
బ్రాండన్ కింగ్(0), కైల్ మేయర్స్(4), షై హోప్(5), కీసీ కార్టీ(6), షిమ్రాన్ హెట్మైర్(4), రోమారియో షెఫెర్డ్(8) దారుణంగా విఫలమయ్యారు. వరుసగా మూడు మ్యాచ్ల్లో మూడు హాఫ్ సెంచరీలు బాదిన ఇషాన్ కిషన్కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కగా.. శుభ్మన్ గిల్ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.