జైపూర్: టాప్-3 బ్యాటర్ల వైఫల్యం తమ పతనాన్ని శాసించిందని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో ఆదివారం జరిగిన మ్యాచ్లో పేలవ బ్యాటింగ్తో రాజస్థాన్ రాయల్స్ 112 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడింది. ఆర్సీబీ బౌలర్లు చెలరేగడంతో రాజస్థాన్ రాయల్స్ 59 పరుగులకే కుప్పకూలింది.
మ్యాచ్ అనంతరం ఈ ఘోర పరాజయంపై స్పందించిన సంజూ శాంసన్.. టాప్-3 బ్యాటర్ల వైఫల్యంతో పాటు పవర్ ప్లేలోనే 5 వికెట్లు కోల్పోవడం ఓటమికి దారితీసిందన్నాడు. పేలవ బ్యాటింగ్కు తన దగ్గర సమాధానం లేదన్నాడు. 'టోర్నీ ఆసాంతం మా టాప్-3 బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. పవర్ ప్లేలోనే అదిరిపోయే ఆరంభాలు అందించారు. కానీ ఈ రోజు కలిసి రాలేదు. ఈ ఓటమిని విశ్లేషించడం చాలా తొందరపాటు అవుతుంది.

పిచ్ నెమ్మదిగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంటుంది. బంతి పాతబడే వరకు కాస్త ఓపికగా ఉండాలి. ఈ టోర్నీలో మేం ఇదే ఫార్మూలాతో బ్యాటింగ్ చేశాం. కానీ ఈ మ్యాచ్లో అలా రాణించలేకపోయాం. ఆర్సీబీ బౌలర్లు అసాధారణ బౌలింగ్తో మా పతనాన్ని శాసించారు. ఈ విజయం క్రెడిట్ వారిదే.
ఈ లక్ష్యం పెద్దదేం కాదు. సునాయసంగా చేధించదగినదే. పవర్ ప్లేలో బాగా రాణిస్తే హోరాహోరీ మ్యాచ్ ఉంటుందని నేను అంచనా వేసాను. బ్యాటింగ్ విభాగంలో ఎక్కడ తప్పు జరిగిందంటే ఇప్పు డు నా దగ్గర సమాధానం లేదు. ఐపీఎల్ స్వభావం ఏంటో మనందరికి తెలిసిందే. లీగ్ దశలో కూడా మనం ఫన్నీ ఘటనలు చాలా చూశాం.
మేం మరింత ధృడంగా ఉండాల్సిన అవసరం ఉంది. కలిసి రాని ఈ రోజును వీలైనంత త్వరగా మరిచి తదుపరి ధర్మశాల మ్యాచ్పై ఫోకస్ పెట్టాల్సి ఉంది. టోర్నీని ఘనంగా ముగించాల్సిన అవసరం ఉంది. ఈ ఓటమి బాధ్యత జట్టులోని ప్రతీ ఒక్కరిది.'అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్(44 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 55), గ్లేన్ మ్యాక్స్వెల్(33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 54) హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా.. చివర్లో అనూజ్ రావత్(10 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 29 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆడమ్ జంపా, కేఎమ్ ఆసిఫ్ రెండే వికెట్లు తీయగా.. సందీప్ శర్మ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ 10.3 ఓవర్లలో 59 పరుగులకే కుప్పకూలింది. షిమ్రాన్ హెట్మైర్(19 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 35) మినహా అంతా విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో వ్యాన్ పార్నెల్(3/10) మూడు వికెట్లతో చెలరేగగా.. మైఖెల్ బ్రేస్వెల్(2/16), కర్ణ్ శర్మ(2/19) రెండేసి వికెట్లు పడగొట్టారు.