IND vs AUS T20I series: వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా.. మెగా టోర్నీ ముగిసిన వెంటనే ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. ప్రపంచకప్ ఫైనల్(నవంబర్ 19) ముగిసిన నాలుగు రోజులకే ఈ సిరీస్ ప్రారంభం కానుంది. భారత్ వేదికగా జరగనున్నఈ సిరీస్ నవంబర్ 23 నుంచి డిసెంబర్ 3 వరకు జరగనుంది.
ఈ టీ20 సిరీస్కు టీమిండియా ప్రధాన ఆటగాళ్లంతా దూరం కానున్నారు. ప్రపంచకప్ ముగిసిన వెంటనే సీనియర్ ఆటగాళ్లంతా రెస్ట్ తీసుకోనున్నారు. ఒకవేళ టీమిండియా విజేతగా నిలిస్తే మాత్రం ఈ జట్టులో ఉన్న ఆటగాళ్లంతా ఈ టీ20 సిరీస్కు దూరంగా ఉండనున్నారు. ఈ ఐదు మ్యాచ్ల సిరీస్ కోసం భారత సెలెక్టర్లు ఈ వారమే జట్టును ప్రకటించనున్నారు.

ఐపీఎల్తో పాటు దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన యువ ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు దక్కనుంది. వెటరన్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ను కూడా ఈ సిరీస్ కోసం ఎంపిక చేసే అవకాశం ఉంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కేరళ జట్టును నడిపించిన శాంసన్.. బ్యాట్తో గొప్పగా ఏం రాణించలేదు.
8 మ్యాచ్ల్లో రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే నమోదు చేశాడు. అస్సామ్తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. అయితే ప్రధాన వికెట్ కీపర్లు అయిన కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ ప్రపంచకప్ టోర్నీ ఆడుతుండటం.. ఆసీస్తో సిరీస్కు దూరంగా ఉండే అవకాశం ఉండటంతో సంజూ శాంసన్కు అవకాశం దక్కనుంది.
రోడ్డు ప్రమాదానికి గురైన రిషభ్ పంత్ పూర్తిగా కోలుకోకపోవడం కూడా అతనికి కలిసి రానుంది. ఆసియా గేమ్స్లో జట్టును నడిపించిన రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. తెలుగు తేజం తిలక్ వర్మకు చోటు దక్కనుంది.
ఆసీస్తో టీ20 సిరీస్కు ఎంపికయ్యే టీమ్(అంచనా)
యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, శివమ్ దూబే, సంజూ శాంసన్, జితేష్ శర్మ, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్, ముకేశ్ కుమార్.